38.2 C
Hyderabad
April 27, 2024 16: 05 PM
Slider ప్రత్యేకం

నాగార్జున సాగర్ నిర్మాత ముక్త్యాల రాజా వర్థంతి నేడు

#muktyalaraja

ఆంధ్రదేశంలో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశానికి చెందినవారు ముక్త్యాల రాజా. ఆయనను ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. ఆంధ్రప్రదేశ్ కు తలమానికమైన నాగార్జున సాగర్ డాం నిర్మాణానికి ప్రసాద్ అహర్నిశలూ శ్రమించారు. తొలుత ఆయన కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి కృషిచేసారు.

ఈ ప్రాజెక్టు పూర్తి అయి ఉపయోగంలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కృష్ణానది నీటిని తమిళనాడుకు తీసుకుపోయేందుకు సన్నాహాలు చేయడం మొదలుపెట్టింది. తొలుత కృష్ణా పెన్నా నదులను అనుసంధానించేందుకు తలపెట్టారు. ఇది తెలిసి మహేశ్వర ప్రసాద్ ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలు తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. 

మాచర్ల నుండి దట్టమయిన అడవులగుండా నందికొండ వరకు వెళ్ళి డాం నకు అనువైన స్థలం చూశారు. సొంత డబ్బుతో రిటైరయిన ఇంజినీర్లను ఒక టీంగా తయారు చేసి వారిచే ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు చేయించారు. మద్రాసు ప్రభుత్వం వారి ప్రయత్నాలకు అన్నివిధాలా అడ్డు పడింది.

రాజా గారు కృష్ణా రైతుల వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు జీపులలో వెళ్ళేందుకు అనువైన దారి లేదనే సాకుతో విషయాన్ని దాటవేసేందుకు ప్రయత్నించారు.

దీని వెనుక ఎవరున్నారో రాజాగారికి అర్ధమయింది. దాంతో ఆయన ఇరవైఐదు గ్రామాలనుండి ప్రజలను, స్వయంసేవకులను వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేయించి కార్లు వెళ్ళేందుకు దారి ఏర్పాటుచేయించారు.  ఖోస్లా కమిటీ నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టు కట్టేందుకు ఇంతకన్న మంచి చోటు వుండదని తేల్చారు. ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు మొదలయ్యాయి.

మహేశ్వర ప్రసాద్ ఢిల్లీ వెళ్ళి ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య లాంటి పార్లమెంటు సభ్యులను కలిసి, రిపోర్టును వెలికితీయించి దాని ప్రతులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషను సభ్యులందరిని ఒప్పించారు.

అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చందూలాల్ త్రివేది ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూను ఖోస్లా కమిటీ రిపోర్టు ఆమోదించమని విజ్ఞప్తి చేశారు. చివరకు 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10వ తేదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. నిర్మాణ సమయంలో మహేశ్వర ప్రసాద్ యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటు ఇచ్చారు.

1966 ఆగస్టు 3న డాం నుండి నీరు వదిలారు. నాగార్జునసాగర్ డాం ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యంగా సాగర్ ఆయకట్టు రైతులకు మహేశ్వర ప్రసాద్ బహుధా స్మరణీయులు. కాని రాజావారి సేవలను తర్వాతి తరం వారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గుర్తించలేదు, సరిగదా పూర్తిగా మరచారు. నేడు ముక్త్యాల రాజా గారి వర్థంతి సందర్భంగా నవతరంపార్టీ నుండి జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం నివాళులు అర్పించారు.

Related posts

ప్రత్యేక హోదా కోసం కాలర్ పట్టుకుంటామని చెప్పి … కాళ్లు పట్టుకున్నారు

Bhavani

తూకంలో తరుగుపై ధాన్యం రైతుల గగ్గోలు

Satyam NEWS

28న రామప్ప కు ముర్ము

Murali Krishna

Leave a Comment