ఏకపక్ష నిర్ణయం తీసుకుని నగర ప్రజలను మానసికంగా మనోవేదనకు గురిచేసిన టీటీడీ ఎస్టేట్ అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ప్రాపర్టీ సెల్ అధికారి ఎస్టేట్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగా దేవాదాయ శాఖకు పంపిన సర్వే నెంబర్లు డబల్ టైం రిపీట్ అయ్యాయని దాని కారణంగా ప్రైవేటు ప్రాపర్టీలు కూడా 22 ఏ లోకి వచ్చాయని, కల్లోలం రేగిన తర్వాత దానికి సవరణలు చేసి పంపుతామని “చావు కబురు చల్లగా చెప్పినట్లు” టిటిడి ఉన్నతాధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు.
తిరుపతిలో 22 ఏ అన్ని వర్గాల ప్రజలను గందరగోళంలోకి నెట్టేసింది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మధ్యతరగతి కుటుంబాలు అప్పు చేసి కొన్న ప్లాట్లు అపార్ట్మెంట్లు 22 A కింద ఉన్నాయన్న అభద్రతాభావంతో మానసికంగా కృంగిపోయారు. తమ సర్వే నెంబర్లు 22 A లో ఉన్నాయా అన్న అనుమానంతో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పరుగులు తీశారు. దాంతో దేవాదాయ శాఖకు లేఖ రాయడం, దేవాదాయ శాఖ అధికారులు తప్పులు సరిదిద్ది పంపే వరకు రిజిస్ట్రేషన్ లను నిలిపివేయాల్సి వచ్చింది.
ఇదంతా కొంత మంది టిటిడి లోని అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడి నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ ల ద్వారా అత్యధికంగా ఆదాయం వస్తుంది. అలాంటిది తొందరపాటు నిర్ణయాలతో ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్న టీటీడీ ఎస్టేట్ అధికారులను సాగనంపాలని ఆయన డిమాండ్ చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాతలు ఇచ్చిన భూములను సైతం టీటీడీ ఎస్టేట్ అధికారులు అవగాహన రాహిత్యంతో 22A తరహాలో డబల్ ఎంట్రీలతో సంరక్షిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతి నగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసినందుకు సంబంధిత టిటిడి అధికారులు నగర ప్రజలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని,మానసిక ఒత్తిడికి గురి చేసినందుకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.