కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాచిపోయిన అన్నం నిజామాబాద్ పసుపు రైతులకు ఇచ్చిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి విమర్శించారు తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన స్పైసెస్ బోర్డు గురించి ప్రస్తావించారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నకిలీ మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఎంపీ గా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పిన అరవింద్ ఆ దిశగా పూర్తిగా విఫలమయ్యాడని ఆయన ఆరోపించారు. ఇపుడు కేంద్రం ఇచ్చింది పసువు బోర్డు కాదు కేవలం స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ మాత్రమేనని ఆయన అన్నారు.
ఇలాంటి రీజినల్ ఆఫీసులు ఇప్పటికే ఆరు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇలాంటి ఆఫీస్ ను 2018 లోనే ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా కేటాయించిందని ఆర్మూర్ ఎమ్మెల్యే అన్నారు. కేంద్రం తాజాగా ఏర్పాటు చేసింది డివిజనల్ ప్రమోషనల్ ఆఫీస్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
పసుపు రైతులకు వాస్తవాలు త్వరలోనే అర్థమవుతాయని ఆయన అన్నారు. పసుపు బోర్డు పై బీజేపీ నేత రాం మాధవ్ మాయ మాటలు చెప్పారు. తెచ్చామని ఇపుడు ట్వీట్ చేస్తున్నారు. బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా? అంటూ ఆయన నిప్పులు చెరిగారు. ఇప్పటికే వరంగల్, గుంటూరు లో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని, వీటివల్ల రైతులకు ఒరిగిందేమి లేదని ఆయన అన్నారు.
ఎంపీ అరవింద్ కు పసుపు భూమి లోపల పండిస్తారా, అంతరిక్షం లో పండిస్తారా అనే విషయం కూడా తెలీదని జీవన్ రెడ్డి అన్నారు. 2019 కు ముందు పసువు గురించి అరవింద్ కు తెలుసా? ఆయనెప్పుడైనా పసుపు రైతుల ఉద్యమం లో పాల్గొన్నారా? అరవింద్ ఓ నకిలీ ఎంపీ, నకిలీ జీఓ లతో మాయ చేస్తుంటారని ఆయన అన్నారు. ఇపుడు మంజూరైన స్పైసెస్ కార్యాలయానికి 15 వేల రూపాయలకు మించి ఖర్చు చేసే అధికారం లేదు. కరెంటు బిల్లు 16 వేలు వచ్చినా ఢిల్లీ నుంచి అనుమతి తెచ్చుకోవాలి. ఢిల్లీ కి విమాన టికెట్ పైసలు కూడా ఆ ఆఫీస్ బడ్జెట్ తో రావు అని ఎమ్మెల్యే తెలిపారు.