దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా పసుపు పంటకు సోకిన డెంపా తెలుగు కారణంగా 20 నుంచి 25 శాతం వరకూ దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపు రైతులను ఆదుకోవడానికి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులు నెత్తి నోరూ బాదుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు.
పైగా పసుపురైతులను అత్యంత దిగువ శ్రేణి రైతులుగా చూడటం మరింత విషాదం. పసుపు బోర్డు ఉంటే ఇలాంటి తెగుళ్ల పై పరిశోధనలు చేయించడం నుంచి మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి రైతులకు సూచనలు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ముందు పసుపు రైతుల గోడు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లే ఉంది.
సాధారణంగా ఎకరానికి 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. కానీ వాతావరణ పరిస్థితుల ప్రకారం ఈ సంవత్సరం గరిష్టంగా 18 నుండి 20 క్వింటాళ్లు దాటకపోవచ్చు. అధిక వర్షపాతం కారణంగా పొలాలు నీరు నిలిచి పోవడంతో వేరు పెరుగుదలపై ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలలో పసుపు పెరుగుతున్న ప్రాంతాలలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.