తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాలతో చెడుగుడు ఆడుకుంటున్నది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని ముందుగా ప్రకటించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ముందుగా చెప్పారు.
దీనికి ఆగమ శాస్త్ర పండితులు కూడా ఓకే అన్నారని ప్రకటించారు. అయితే తొలుత అనుకున్నట్టు 10 రోజులు ఉండదని టిటిడి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం రెండు రోజులు మాత్రమే ఉంటుందని ఆయన తెలిపారు.
తిరుమలకు వచ్చిన విశాఖ శారదాపీఠం అధిపతి స్వరూపానంద సరస్వతిని టీటీడీ ఛైర్మన్, ఆలయ ప్రధాన అర్చకుడు కలిశారు. అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఉత్సవమూర్తుల విగ్రహాల అరుగుదల అంశాన్ని స్వామీజీ దృష్టికి అర్చకులు తీసుకొచ్చారని, చారిత్రక ఆలయాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని స్వామీజీ చెప్పారని తెలిపారు. ఈ నెల 21 వరకు స్వరూపానంద సరస్వతి తిరుమలలోనే బస చేయనున్నారు.