తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న వర్చువల్ విధానంలో జరుగనున్న వరలక్ష్మీ వ్రతం ఆన్లైన్ టికెట్లను టిటిడికి చెందిన గోవింద మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
భక్తుల కోరిక మేరకు వర్చువల్ సేవగా ప్రవేశపెట్టిన వరలక్ష్మీ వ్రతం టికెట్లకు ఆన్లైన్లో భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. చాలా మంది భక్తులు టిటిడి వెబ్సైట్ ద్వారా ఈ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటికే బుక్ చేసుకున్న పలువురు భక్తులకు పోస్టల్ శాఖ ద్వారా పూజాసామగ్రిని బట్వాడా చేశారు.
పూజాసామగ్రికి ప్రత్యేక పూజలు
వరలక్ష్మీవ్రతం టికెట్లు పొందిన భక్తులకు అందించే ప్రసాదాలకు సోమవారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా టిటిడి చీఫ్ ఇంజినీర్ ఎం.రమేష్రెడ్డి ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి పూజాసామగ్రిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఆ తరువాత అమ్మవారి మూలవిరాట్టు పాదాల వద్ద ఉత్తరీయం, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, అక్షింతలు, కంకణాలు ఉంచి పూజలు చేశారు. టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తుల గోత్రనామాలను అర్చకస్వాములు అమ్మవారికి నివేదించారు.
అనంతరం ఈ పూజాసామగ్రిని గృహస్తులకు బట్వాడా చేసేందుకు పోస్టల్ అధికారులకు అందజేశారు. జూలై 31వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతంఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. వ్రతంలో పాల్గొనే భక్తులు అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో సుబ్రమణ్యం, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.