పాడి పశవులలో పునరుత్పత్తి సక్రమంగా ఉన్నట్లయితే ఈతల మద్య కాలం తగ్గి తద్వార పశువుల జీవిత కాలంలో ఎక్కువ పాల దిగుబడి మరియు ఎక్కువ దూడలని పొందవచ్చుని నాగర్ కర్నూల్ జిల్లా పశు వైద్య మరియు పశు సంవర్ధక అధికారి డా. జి.వి. రమేష్ అన్నారు.
దీని ద్వారా పాడి పరిశ్రమ రైతులకు లాభసాటిగా ఉంటుందని డా జి.వి.రమేష్ పేర్కొన్నారు. నేడు ఐతోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన పునరుత్పత్తి శిబిరం లో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పుష్టికరమైన పశు గ్రాసాలను మేపినట్లైతే పశువులు ఆరోగ్యంగా ఉంది సరైన సమయంలో ఎదకు వచ్చి చూలు కడతాయి, ఆరోగ్య వంతమైన దూడకు జన్మ నిస్తాయి, గర్భకోశ సమస్యలు రావు అని ఆయన తెలిపారు.
పశువులు ఆరోగ్యంగా ఉండాలంటే పుష్టికరమైన పశుగ్రాసం తో పాటు మిశ్రమ దాన,ఖనిజ లవణాలు అందించాలని తెలిపారు. ఉచిత పశు వైద్య శిబిరం లో ఎదకు రాని పశువులు, గర్భ కోశ వ్యాధులు, ఇతర వ్యాధులు ఉన్న 104 పశువులకు చికిత్సలు చేశారు. అదే విధంగా ప్రభుత్వం నుండి సంవత్సరానికి రెండుసార్లు గాలికుంటు టీకాలు ,గొంతువాపు , జబ్బ వాపు టీకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా రాజేష్ కుమార్, సల్మా సుల్తానా, రమేశ్, జానయ్య,రవి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.