విశాఖపట్నం రాజధానిగా మారబోతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరింత కీలకంగా మారబోతున్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ విజయసాయిరెడ్డి ఇప్పటికే కీలక శక్తిగా ఉండగా ఇప్పుడు మరింత శక్తిమంతంగా మారబోతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాటి నుంచి విజయసాయిరెడ్డి విశాఖపట్నంపై దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశంపై ఆయన అప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ఆయన వేసుకున్న అంచనాల ప్రకారమే పార్టీ అధికారంలోకి రావడంతో విజయసాయి రెడ్డి విశాఖ పట్నాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయం నడిపారు. విశాఖ పట్నంలోని అధికారులు కూడా అక్కడి మంత్రుల కన్నా ఎక్కువగా విజయసాయి రెడ్డి ప్రతిపాదనలకే ప్రాముఖ్యత ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు అమరావతి పై దృష్టి సారించి ఉన్న తరుణం నుంచి విజయసాయి రెడ్డి విశాఖపట్నంపై శ్రద్ధ చూపిన కారణంగా ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. పార్టీ అధికారంలోకి రాగానే ఆయన మిగిలిన కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించడంతో పని సుళువు అయింది.
ప్రస్తుతం విజయసాయి రెడ్డి కరోనా నుంచి కోలుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. మూడు రాజధానుల బిల్లుకు చట్ట రూపం రావడంతో ఇప్పుడు పనులు చకచకా జరుగుతున్నాయి. విజయసాయిరెడ్డి విశాఖ పట్నం నేతలకు ఇప్పుడు కూడా ఫోన్ పైనే సూచనలు సలహాలు ఇస్తున్నారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నంపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా విజయసాయి రెడ్డిని సంప్రదించాల్సినంత కీలకంగా ఆయన మారిపోయారు. విశాఖపట్నం ఇప్పుడు రాజధాని కావడంతో విజయసాయి రెడ్డి ముందు నుంచి చెబుతున్న మాట వాస్తవం అయిందని స్థానిక రాజకీయ నాయకులు కూడా అనుకుంటున్నారు.
ఎవరు అడ్డుకున్నా రాజధాని మార్పు ఆగదని ఆయన చాలా సందర్భాలలో చెప్పిన విషయాన్ని స్థానిక నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ అంటే విజయసాయి, విజయసాయి అంటే విశాఖగా మారిపోయాయి.