ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని సర్ సి ఆర్ రెడ్డి అటానమస్ కాలేజీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో నేడు కళాశాల ప్రాంగణంలో 200కు పైగా మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్ సి ఆర్ రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎం బి ఎస్ వి ప్రసాద్ విచ్చేసి మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని జీవులన్నీ ప్రకృతిని ఆసగాగా చేసుకుని జీవిస్తున్నాయని అటువంటి ప్రకృతిని కాపాడుకోవడంలో మనమందరం భాగస్వాములం కావాలని కోరారు.
ప్రతి సందర్భంలో, శుభ కార్యాలలోనూ మొక్కలను బహుమతిగా ఇచ్చి పుచ్చుకోవాలని ఆయన సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ వీరభద్రరావు మాట్లాడుతూ సహజ వనరులు క్షీణించిపోతూ పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటున్న తరుణంలో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం తెలియచేస్తుందని అన్నారు.
పి జి కోర్సుల డైరెక్టర్ డాక్టర్ కె ఏ రామరాజు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె ఏ ఇమ్మాన్యుయేల్, ఐక్యూ ఏసి కో ఆర్డినేటర్ డాక్టర్ పి పాల్ దివాకర్, వైస్ ప్రిన్సిపాల్ కె విశ్వేశ్వరరావు, బోటనీ అధ్యాపకురాలు జంగం మేరీ జోత్న, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ కొండ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.