కీలక బాధ్యతల నుంచి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డిని తప్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉంటూ వైసీపీ అనుబంధ సంఘాల బాధ్యతను, సోషల్ మీడియా వింగ్ ను కూడా చూస్తున్నారు.
విజయసాయి రెడ్డికి పని భారం పెరిగిందని భావించిన జగన్ ఆయన నుంచి సోషల్ మీడియా వింగ్ ను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విజయసాయి రెడ్డికి బాధ్యతలు కట్ చేసి భార్గవ్ రెడ్డికి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలు పెరుగుతుండడంతో కౌంటర్ స్ట్రాటజీ టీమ్ అవసరమని సీఎం జగన్ భావిస్తున్నారు. నిజానికి ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏదైనా ఆరోపణ వచ్చినా, కౌంటర్ వచ్చినా క్షణాల్లో తిరిగి కౌంటర్ ఇచ్చేస్తుంది.
అయితే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటంతో పాటు ఆరోపణలు పెరుగుతుండటంతో ఇక సోషల్ మీడియాను మరింత పటిష్టం చేయాలని జగన్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వింగ్ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భార్గవ్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్ కు జగన్ ఫిదా అయ్యారట. దాంతో ఆయనకే సోషల్ మీడియా వింగ్ అప్పగించాలని భావించారు.
జాతీయ స్థాయి కార్యకలాపాలతో విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోన్నందున ఆయనకు బదులుగా భార్గవకు ఆ బాధ్యతలను అప్పగించాలని వైఎస్ జగన్ భావించినట్లు చెబుతున్నారు. వచ్చే మూడు సంవత్సరాలు అత్యంత కీలకమైనవి కావడం వల్ల సాయిరెడ్డి ఇక పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకాలాపాలను నిర్వహించడానికి సమయాన్ని కేటాయించడానికి వీలుగా ఈ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.