సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో విజృంభిస్తున్న డెంగ్యూ,టైఫాయిడ్,మలేరియా,వైరల్ విష జ్వరాలు ప్రబలుతున్నాయని సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం అధికారి సీనియర్ అసిస్టెంట్ రాఘవరావు కి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ.అజీజ్ పాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాచిమంచి గిరిబాబు మాట్లాడుతూ వర్షాకాల సీజన్ ప్రారంభమైన నాలుగు నెలలు గడుస్తున్నా అంటువ్యాధులు ప్రబలుతూ, పట్టణంలో జ్వరాలు విజృంభిస్తున్నా మున్సిపాలిటీవారు పారిశుధ్యనికి సంబంధించిన అంశాలలో విఫలమవుతున్నారని, పట్టణంలోని వివిధ వార్డులలో ఇప్పటికే డెంగ్యూ,విష జ్వరాల బారిన పడి కొంతమంది ప్రమాదకర స్థాయిలో వెళ్లిన సంఘటనలు ఉన్నాయని అన్నారు.
ముందస్తు జాగ్రత్తగా ప్రజల ఆరోగ్యాలను కాపాడటానికి కావలసిన కనీస మౌలిక వసతుల అంశాలను వార్డులలో ఏర్పాటు చేయించకపోవటం ఏమిటని,వచ్చిన జనరల్ బడ్జెట్ నిధులు ఏమి చేస్తున్నారని వారు ప్రశ్నించారు. పట్టణంలో వివిధ వార్డులలో అనేకంగా పిచ్చిమొక్కలు మొలచి ఉండటం,డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక కాలువల్లో మురుగు నీరు నిల్వలు ఉండటం,చెత్త బండ్లు ప్రతిరోజు అన్ని వార్డులలో సక్రమంగా రాకపోవడం, చెత్త ఇండ్లలో పేరుకుపోవడం వలన అనేక క్రిములు కీటకాలు చేరి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గురుకుల పాఠశాలలు,సంక్షేమ హాస్టళ్లలో వందలాది మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని,ఆ గురుకుల పాఠశాలలలో దోమల మందును, బ్లీచింగ్ పౌడర్ ను, హైపో క్లోరైడ్ ద్రావణాన్ని ఫాగింగ్,పిచికారీ, చేయించవలసిన బాధ్యత మున్సిపాలిటీపై ఉందని గుర్తు చేశారు.
పట్టణంలో అన్ని వీధులలో పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేస్తూ ప్రజలను కరుస్తూ,భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని,తక్షణమే నివారణకు చర్యలు తీసుకోవాలని, అన్ని బావుల వద్ద, బోర్లు,వాటర్ ఫిల్టర్ బెడ్ ల వద్ద,మురికి కాలువల వద్ద పూర్తి స్థాయిలో బ్లీచింగ్ చెల్లించాలని అన్నారు.
వివిధ వార్డుల్లో పేరుకు పోయిన పిచ్చిమొక్కలను,మురుగు నీరును తక్షణమే శుభ్రం చేయించాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించి పట్టణంలో ప్రజలకు,గురుకులాల, హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినీ,విద్యార్థులకు అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను తక్షణమే చేపట్టి వారి ఆరోగ్యాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షుడు మేళ్ళచెరువు ముక్కంటి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్,కొలపుడి యోహాన్,కస్తాల ముత్తయ్య,దొంతగాని జగన్,అంజయ్య,ఆర్.రాము తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్