విశాఖ – రాయ్పూర్ జాతీయ రహదారికి సంబంధించిన భూ సేకరణపై విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషో ర్ కుమార్ తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియలో సమస్యలను అధిగమించేందుకు అవసరమైన చోట్ల గ్రామ సభలు నిర్వహించాలని ఆర్డీవో భవానీ శంకర్కు సూచించారు.
అటవీ భూమిని సంబంధించి రీ సర్వే చేయించాలని చెప్పారు. మొదటి ఫేజ్కు సంబంధించి పాచిపెంట మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందని, దీనిపై నివేదిక కోరినట్లు ఆర్డీవో జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఫేజ్ల వారీగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అంశాలను వివరించారు. పులిగుమ్మి, కొనిస, దేవుపల్లి, జక్కువ తదితర చోట్ల సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి భూ సేకరణ ప్రక్రియను త్వరతిగతిన పూర్తి చేయాలని జేసీ… ఆర్డీవోను ఆదేశించారు.
ఇప్పటి వరకు సేకరించిన భూమికి సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని చెప్పారు. అలాగే అటవీ భూమికి సంబంధించి అభ్యంతరాలు లేనట్టుగా పేర్కొంటూ అనుమతి పత్రాలు మంజూరు చేయాలని జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ శివశంకర్ జేసీని కోరగా.. ఆయన సమ్మతి తెలిపారు. అవార్డు అయ్యి.. పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగని చోట గ్రామ సభలు నిర్వహించాలని, ప్రక్రియను ముగించాలని జేసీ ఆదేశించారు. ఫారెస్ట్ ల్యాండ్కు సంబంధించి ఏమైనా ఇబ్బందులు, సాంకేతిక ప్రక్రియలు ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో భవానీ శంకర్, జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ శివ శంకర్, ఫారెస్టు, హార్టికల్చర్, రెవెన్యూ ఇతర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.