మానవ సేవే మాధవ సేవగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఏపీలో్ని విజయనగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి అన్నారు. ఈ మేరకు దాసన్నపేట రైతు బజార్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బోడ సింగి ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ శ్రావణి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయక మన్నారు. వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గత పదేళ్లు గా దాసన్నపేట ప్రాంతంలో పార్టీ శ్రేణులు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు.
అనంతరం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బోడ సింగి ఈశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పొంత పల్లి గోపి లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి గారి ప్రోత్సాహంతో గత పదేళ్లుగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాదచారులకు , వాహన దారులకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి జన్మదినం ఈ నెల 26న పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే ముందుగానే ఈ చలివేంద్రాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆల్తీ శ్రీనివాసరావు, రామతీర్థం దేవస్థానం పాలక మండలి సభ్యులు దాట్ల చిట్టి రాజు, డివిజన్ పార్టీ అధ్యక్షులు ఆల్తి చిట్టిబాబు, పొడిలాపు చిన్ని కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.