మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం శాగాపూర్, గుడిబండ గ్రామ పరిధిలో మొత్తం 69 ఎకరాల భూమిలో ల్యాండ్ మాఫియా చేస్తున్న అక్రమ దందాను ఇప్పటికే అడ్డుకున్నామని సామాజిక కార్యకర్త, “నేనుసైతం” స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. నాలా, డీటిసిపి, పంచాయతి రాజ్, ఇతర సంబంధిత శాఖల అనుమతులు లేకుండా, చట్టాలకు వ్యతిరేకంగా అడ్డాకల్ లో ల్యాండ్ మాఫియా ఫామ్ ప్లాట్ ల పేరిట అగ్రికల్చర్ భూమిని అక్రమంగా అమ్మడం, అనంతరం డిటీసీపీ అనుమతులు లేకున్నా…. హ్యాపీ హోమ్ రిసార్ట్ డిటీసీపీ లేఔట్ పేరిట అమ్మడం చట్ట విరుద్ధమని…..అందుకే ఈ ల్యాండ్ మాఫియాపై పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
ఈ మాఫియా వెనకవున్న పెద్ద తలకాయలను వదిలే ప్రసక్తే లేదని ప్రవీణ్ తెలిపారు. అంతేకాకుండా స్థానిక అధికారులతో పాటు జిల్లా, రాష్ట స్థాయి సంబంధిత ఉన్నతాధికారులు ఈ అడ్డాకల్ ల్యాండ్ మాఫియాపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, ఈ అక్రమ భూ దందాతో సంబంధం ఉన్న అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నేనుసైతం స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో న్యాయపోరాటం చేసి, అమాయక ప్రజలు, బాధితులు కట్టిన డబ్బులను ల్యాండ్ మాఫియా తిరిగి చెల్లించే వరుకు బాధితులకు అండగా ఉంటామని, ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమిస్తామని ప్రవీణ్ తెలిపారు.