రాయలసీమ కు అక్రమంగా ఒక్క నీటి బొట్టును తరలించినా ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో నోట్ ను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 5 న పోతి రెడ్డి పాడు నుంచి 80 వేల క్యూసెక్కులను అక్రమంగా తరలించేందుకు జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు.
పోతిరెడ్డి పాడు పై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందని ఒక్క పోతిరెడ్డి పాడే కాదు, గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా గురించి గతం లో పోరాడిన వాళ్ళం మాకు అన్ని విషయాలు అవగాహన ఉన్నది అని ఆయన అన్నారు.
ఇప్పటికే ఈ అంశంపై సీఎం కెసిఆర్ దక్షిణ తెలంగాణ కు సంబంధించిన మంత్రులు ,పార్టీ నేతలు ,ఇరిగేషన్ నిపుణులతో చర్చించారని ఆయన అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీం కోర్టు లో ఏపీ ప్రభుత్వ అక్రమ నీటి తరలింపుల పై పోరాడతామని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాల పై అవగాహన ,సమాచారం లేని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ బుధవారం నాడు నల్ల జెండాలతో ప్రదర్శనలు జరపాలని పిలుపు నివ్వడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. నల్ల జెండాలతో నిరసనలు కాదు కావాల్సింది పోతిరెడ్డి పాడు నుంచి అక్రమ నీటి తరలింపు పై బీజేపీ నిఖార్సుగా పోరాడితే చాలు అని ఆయన అన్నారు. పోతి రెడ్డి పాడు నుంచి అక్రమంగా నీటి తరలింపు ను ఏపీ బీజేపీ స్వాగతిస్తోందని ముందు వాళ్ల పార్టీ వారిని ప్రశ్నించాలని ఆయన అన్నారు.