అత్యధిక ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ ప్రగల్భాలివి. కట్ చేస్తే నాలుగేళ్ల తర్వాత, కేంద్రం మెడలు వంచటం సంగతి పక్కన పెడితే, సీఎం సారు ఏరి కోరి ఎంచుకున్న ఎంపీలు కూడా ఆయన మాట వినే పరిస్థితి కనిపించడం లేదు. జగన్ అధికారంలోకి వస్తే ఎంతో మేలు చేస్తారని అత్యధిక మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన మాత్రం ఆ ఎమ్మెల్యేల ఓట్లతో పొరుగు రాష్ట్రాల వారిని రాజ్య సభకు పంపారు.
రిలయన్స్ లాబీయిస్ట్ పరిమళ్ నత్వానీ వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా గెలిచినా ఒక్క సారి కూడా ఏపీ వైపు చూడలేదు. రాజ్యసభలో ఆయన రాష్ట్ర ప్రజయోనాల కోసం పోరాటం కాదు కదా, కనీసం గట్టిగా మాట్లాడిన ధాఖలాలు కూడా లేవు. వైసీపీ దిగుమతి చేసుకున్న మరో రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి కేవలం జగన్ కేసుల వ్యవహారాలు చూసుకోవడానికే పరిమితమయ్యారు. వీరు రాజ్యసభకు వెళ్లింది, పేరు పక్కన ఎంపీ అనే టైటిల్ కోసం తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదనేది విమర్శకుల అభిప్రాయం.
ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన మరో ఇంపోర్టెడ్ లీడర్ మరో ఎంపీ ఆర్ కృష్ణయ్య. దశాబ్దానికిపైగా బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్య బీసీల కోసం ఏం చేశారో తెలియదు గానీ, సంఘాన్ని అడ్డం పెట్టుకొని వ్యతిగతంగా పలుకుబడితో పాటు అనేక పదవులు సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టిడిపిలో చేరిన కృష్ణయ్య ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఆ పార్టీలో మళ్లీ టికెట్ రాదని అర్ధమై, కాంగ్రెస్లో చేరారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడియారు. ఆ ఓటమి తర్వాత తనకు అవకాశం ఇచ్చిన పార్టీకే రివర్సై కేసీఆర్ భజన ప్రారంభించారు కృష్ణయ్య. ఆ భజన ఫలితమో, అదృష్ణమో గానీ వైసీపీ పెద్దలు పిలిచి మరీ ఏపీ నుంచి రాజ్యసభకు పంపించారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనా, ఆ రాష్ట్రం కోసం కృష్ణయ్య పార్లమెంటులో చేసిందేమీ లేదు.
మళ్లీ ఎన్నికల సీజన్ రావడంతో కృష్ణయ్యకు కాంగ్రెస్ నుంచి మరో బంపర్ ఆఫర్ వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ బీసీలకు అనుకూలంగా ఉందనే అభిప్రాయం కల్పించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణలో అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై, కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినా, ఆయనను కంట్రోల్ చేయడానికి పార్టీ పెద్దలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదట. కృష్ణయ్యపై చర్యలు తీసుకుంటే బీసీల్లో పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్న భయంతో వైసీపీ ఆయనకు తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోంది.
ఒకపప్పుడు ప్రజా ప్రతినిధులు సొంత లాభం వదులుకొని, ప్రజల కోసం పని చేసే వారు. ఇప్పటి నాయకులకు ప్రజా సేవ చివరి ఆప్షన్ అయిపోయిందని… పేరు, పలుకుబడి, పదవులు, ఆదాయం తర్వాతే ప్రజల గురించి ఆలోచిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.