ఆంధ్రప్రదేశ్ లో అసలు ఆట ఇప్పుడు మొదలైందని అంటున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుతో మొదలైన ఈ గేమ్ మరింత మంది అరెస్టులకు వెళుతుందని కూడా అనుకుంటున్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్ మందుల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అయిన విషయం తెలిసిందే.
అసెంబ్లీలో వైసీపీపై విరుచుకుపడే అచ్చెన్నాయుడును అసెంబ్లీ సమావేశాల ముందే అరెస్టు చేయడం ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం కలిగించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ అరెస్టును ముక్త కంఠంతో ఖండించగా వైసీపీ నాయకులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మరక్షణలో పడిపోయిన స్థితి నుంచి ….
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీకోర్టు స్టే నిరాకరించడం, వైసీపీ రంగుల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు లాంటి ప్రతిబంధకాలు ఎదురైన నాటి నుంచి ఆత్మరక్షణలో పడిపోయిన వైసీపీ ప్రభుత్వం అచ్చెన్నాయుడి అరెస్టుతో తెలుగుదేశం పార్టీపై తన దాడిని తీవ్రతరం చేసింది.
ఈఎస్ఐ కుంభకోణం కొత్త ది కాదు. చాలా రోజుల నుంచి అవినీతి నిరోధక శాఖ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అక్కడి అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన వారే దాదాపుగా ఏపి కి సంబంధించిన కేసులో కూడా నిందితులు.
అందువల్ల ఆ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏసీబీ పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. ఇదే కేసుకు సంబంధించి మరో మంత్రి పితాని సత్య నారాయణ పై కూడా కత్తి వేలాడుతున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా సీఆర్ డియే భూముల కుంభకోణానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ పై కూడా అభియోగాలు నమోదు అయి ఉన్నాయి.
చంద్రన్న కానుకలో కూడా పెద్ద వికెట్టే?
అంతే కాకుండా చంద్రన్న కానుకలో భారీ కుంభకోణం జరిగినట్లు నిన్ననే ఏపి మంత్రి వర్గం నిర్ధారించింది. ఈ మేరకు ఒక నివేదికను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమర్పించింది. ఈ కుంభకోణంలో కూడా నిందితులు పెద్దవారే ఉంటారు.
అదే విధంగా ఏపి ఫైబర్ నెట్ కు సంబంధించిన కుంభకోణంపై కూడా మంత్రి వర్గ ఉప సంఘం తన నివేదికను ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ ఎల్ వన్ గా వస్తే దాన్ని కాదని తమకు కావాల్సిన సంస్థకు ఫైబర్ నెట్ టెండర్ కట్టబెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసును ఏపి ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది.
లోకేష్ మెడకు కూడా ఉచ్చు ఖాయం….???
సీబీఐ దర్యాప్తు వేగవంతం చేస్తే మాజీ మంత్రి లోకేష్ మెడకు ఉచ్చు బిగుసుకుంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనావేస్తున్నాయి. అదే విధంగా సర్వ శిక్షా అభియాన్ కు సంబంధించిన కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై అభియోగాలు ఉన్నాయి.
అచ్చెన్నాయుడు అరెస్టుతో తెలుగుదేశం నాయకులు పూర్తిగా భయపడి పోవడం వల్ల రాజకీయంగా వైసీపికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికే మాజీ మంత్రి సిద్దారాఘవ రావు లాంటి వారు వైసీపీలో చేరిపోగా మరి కొందరు కూడా అదే బాటన పడితే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుంది.