రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రస్తుత వర్షాకాల సీజన్ లో మిషన్ మోడ్ తరహాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశంపై దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను కోరారు. శుక్రవారం బిఆర్ కెఆర్ భవన్ లో అర్బన్ ఫారెస్ట్ లపై సి.యస్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవంతో పాటు ఆక్రమణ లనుండి కాపాడాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ ను అమలు చేయడానికి అధికారులు పచ్చదనం పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లోకేషన్ల లోని 188 ఫారెస్ట్ బ్లాక్ లకు సంబంధించి 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
హైదరబాద్ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతి చోట పెద్ద ఎత్తున మొక్కలు నాటేకార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను కోరారు. జిహెచ్ఎంసి ద్వారా కాంప్రహెన్సివ్ రోడ్ మేనేజ్ మెంట్ కార్యక్రమం క్రింద చేపడుతున్న రోడ్లకు ఇరు ప్రక్కల, స్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు, డ్రైన్ ల వెంట పెద్దఎత్తున మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని ఆయన కోరారు.
మెట్రో కారిడార్ ల ఇరుప్రక్కలు, మీడియం లు, డిపోల వద్ద పచ్చదనం పెంపొందించడానికి మొక్కలు నాటాలన్నారు. HMDA, TSIIC, HMRL అటవీ శాఖ ద్వారా అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ లలో వెంటనే మొక్కలు నాటాలన్నారు. కాంపా నిధుల కింద అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల అభివృద్ధికి కేంద్రానికి పంపటానికి 900 కోట్ల రూపాయలతో కార్యచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల కోసం కాంపా కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ని ఏర్పాటు చేయాలన్నారు. ఫారెస్ట్ బ్లాక్ ల భూసమస్యల పరిష్కారం కోసం RDO, DFO సంబంధిత ఏజెన్సీలతో ఫారెస్ట్ బ్లాక్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసి వారంలోపు పరిష్కరించాలన్నారు.
నాటే మొక్కల పురోగతిపై క్రమం తప్పకుండా సమీక్షించనున్నట్లు సి.యస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, పిసిసిఎఫ్ శోభ, ఓఎస్డి టు సిఎం ప్రియాంకవర్గీస్ తదితరులు పాల్గొన్నారు.