ప్రక్క రాష్ట్రలైన తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు కరోనా బాధితులను పరామర్శించేందుకు ఆసుపత్రుల సందర్శనకు వెళుతుంటే యువ ముఖ్య మంత్రిగా చెప్పుకునే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ Y. V. B. రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
కరోనా బాధితుల్ని పరామర్శించడానికి కోవిడ్ హాస్పటల్ సందర్శనకు బయలు దేరిన రాజేంద్ర ప్రసాద్ ను కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీసులు నేడు హౌస్ అరెస్టు చేశారు.
కరోనా బాధితుల్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడానికి వెళుతున్న మమ్మల్ని ఇలా అక్రమ అరెస్టులు చెయ్యడం దారుణమని రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాగో తాడేపల్లి ప్యాలస్ వదిలి బయటకురారు.
రాష్ట్ర ప్రజలు కరోనాతో వేల మంది చనిపోతున్నా నిమ్మకు నీరెత్తనట్లు ఉంటున్నారు అని ఆయన అన్నారు. రోగుల్ని పరామర్శించేందుకు వెళుతున్న తమను ఆపడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
మీరు, మీ మంత్రులు, ఎమ్మెల్యే లు చెయ్యవల్సిన పని మా తెలుగుదేశం పార్టీ నాయకులం తలపెడితే కక్ష కట్టి అక్రమ అరెస్టులు, కేసులు పెడతారా అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో రోజుకు 22 నుంచి 25 వేల కరోనా కేసులు వస్తుంటే వైసీపీ ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలు తీసుకోకుండా, ప్రతి పక్ష నాయకులపై కక్ష పూరిత పనిలో నిమగ్నమై ఉందని ఆయన విమర్శించారు.