తను పార్టీ మారుతున్నానని ప్రతి సారీ మీడియానే తేదీ, సమయాలను ప్రకటించేస్తున్నాయని రాష్ట్ర మాజీ మంత్రి విశాఖ ఉత్తరం నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు మీడియాతో వాపోయారు. తన ప్రమేయం లేకుండానే తాను పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతుందని కూడా ఆయన అన్నారు. తాను పార్టీ మారుతున్నట్టు ఏ రోజు ప్రకటించలేదన్నారు. అంతా విన్న తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉంటున్నారా? లేక వైసీపీలో చేరుతున్నారా? అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు.
ఏ పార్టీ అధినేతనైనా సరే తాను లొంగదీసుకోగలను అని గంటా ధీమాగా ఉంటారని అంటుంటారు. నిన్న మొన్నటి వరకు గంటా వైకాపా లోకి వెళ్లడం ఖాయం అనుకున్నారు.. మరి ఎందుకు ఈ ప్రకటన చేశారు…..ఇక అసలు విషయంలోకి వెళ్తే…. టీడీపీ లో ఉన్న అంత స్వాతంత్య్రం వైకాపా లోకూడా ఉంటుంది అనుకున్నారు గంటా.. ముఖ్యంగా ఆయన ఏ పార్టీలో ఉన్న పోటీ చేసే నియోజకవర్గాన్ని ఆయనే ఎంపిక చేసుకుంటారు….
అంతే కాకుండా తన అనుచర గణానికి.. అదేనండి ఆయన బ్యాచ్ కు కూడా టికెట్ లు ఇప్పించుకుంటారు. ఎవరినైనా తన అదుపులో పెట్టుకుంటాను అని అనుకునే గంటాను పార్టీలో చేర్చుకోడానికి వైసీపీ పెట్టిన షరతులు చూస్తే ఆయనకు కళ్లు బైర్లు కమ్మినట్లు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖ తూర్పు టీడీపీ ఎం.ఎల్.ఏ వేగలగపూడి రామకృష్ణ ను ఈసారి ఎలాగైనా ఓడించాలి అనే పట్టుదలతో జగన్ ఉన్నారు.
అయితే ఇప్పుడు విశాఖ తూర్పు నకు వైకాపా కు అభ్యర్దే లేడు. గతంలో పోటీచేసి ఓడిన అక్రమని విజయనిర్మల కు టికెట్ ఖరారు చేయలేదు. అంతకు ముందు పోటీ చేసి ఓడిన ప్రస్తుత ఎం.ఎల్.సి వంశీ కృష్ణ యాదవ్ కూడా పోటీ చేయడానికి సిద్ధపడడం లేదు అని టాక్. ప్రస్తుత విశాఖ ఎంపీ ఎంవివి ని పోటీలో పెడితే ఎలా ఉంటుందా అని వైకాపా ఆలోచన చేస్తున్నదని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎంపి టికెట్ ఇవ్వకపోయిన పర్వాలేదు కానీ తాను మాత్రం విశాఖ తూర్పు నుంచి పోటీ చేయను అని ముఖ్యుల దగ్గర అంటున్నట్లు ఇన్ సైడ్ టాక్. వెరసి అక్కడ వైకాపా కు ఉన్న ఏకైక ఆప్షన్ నగర పార్టీ నూతన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ మాత్రమే. పంచకర్ల రమేష్ గంటాకు సన్నిహితుడు. పంచకర్ల రమేష్ ను వెలగపూడి పై పోటీకి దించాలని ప్లాన్ చేస్తుంటే.. పంచకర్ల చూపు పెందుర్తి వైపు ఉంది..
ఇది ఇలా ఉండగా అసలు విషయానికి వస్తే విశాఖ తూర్పు,యలమంచిలి ,పాయకరావుపేట , అనకాపల్లి నియోజకవర్గ గెలుపు బాధ్యతలు తీసుకోవాలని వైసీపీ పెద్దలు గంటాకు కండిషన్ పెట్టినట్టు టాక్. బాధ్యతలు అంటే అన్ని రకాల బాధ్యతలు ఉంటాయి. ఈ షరతు పెట్టడమే కాకుండా గంటా కు భీమిలి కేటాయిస్తామని హామీ కూడా ఇవ్వలేదట. నియోజకవర్గ ఎంపిక కూడా వైకాపా టీం కేటాయిస్తుందని గంటా కు తెలిపినట్టు సమాచారం.
అంతేకాకుండా గంటా తో పాటు వచ్చే తన అనుచరగణానికి ఒక్క టికెట్ కూడా కేటాయించేదిలేదని కూడా వైసీపీ పెద్దలు చెప్పారని అంటున్నారు. అయితే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ముఖం మీదే చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. బలహీనంగా, గ్రూప్ తగాదాలతో, ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను గంటా తన చరిష్మాతో గెలిపించాలని కూడా షరతు పెట్టారని అంటున్నారు.
షరతులకు కంగు తిన్న గంటా పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 1 తన పుట్టిన రోజున ఏ విషయమో తేల్చేస్తారు అనుకున్నా కూడా గంటా ఆ రోజు షిర్డీ వెళ్లినట్టు సమాచారం. తిరిగి వచ్చాక కూడా గంటా ఎటువంటి ప్రకటన చేయలేదు. నేడు కాపునాడు బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరణ లో ప్రత్యేక్షమై తన ప్రమేయం లేకుండానే పార్టీ మారుతాననే ప్రచారం జరుగుతుందని పార్టీ మారుతున్నట్టు తాను ఏ రోజు ప్రకటించలేదన్నారు.
ఏం రాసుకున్నా, ఏం ప్రచారం చేసుకున్నా తనకు సంబంధం లేదన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే… తానే చెబుతానని.. చెప్పే చేస్తానని స్పష్టం చేశారు. ఎక్కడ కూడా తాను వైకాపాలోకి వెళ్తానని కానీ.. టీడీపీ లోనే ఉంటాను అని కానీ స్పష్టం చేయకపోగా.. వెళ్తే మాత్రం మీకు చెప్పే వెళ్తాను ఏ పార్టీకో మాత్రం చెప్పకుండానే గంటా తప్పించుకున్నారు.
రామకృష్ణ పూడి, విశాఖపట్నం