కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. వరసగా మూడోసారీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపుబావుటా ఎగరేసి టీఎంసీ హ్యాట్రిక్ కొట్టింది. 144 వార్డులున్న కార్పొరేషన్లో ఏకంగా 134 వార్డులను టీఎంసీ కైవసం చేసుకుంది. ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో దాదాపు 72 శాతం ఓట్లు టీఎంసీకే పడటం విశేషం.
టీఎంసీకి ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. రెండు వార్డుల్లో గెలిచిన లెఫ్ట్ ఫ్రంట్ 11.13 శాతం ఓట్లను మూటగట్టుకుంది. బీజేపీ సాధించిన 8.94శాతం ఓట్లతో పోలిస్తే సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ సాధించిన ఓట్లే ఎక్కువ కావడం గమనార్హం.
దీంతో సాధించిన ఓట్ల పట్టికలో లెఫ్ట్ ఫ్రంట్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ మూడు, కాంగ్రెస్ రెండు వార్డులను గెల్చుకున్నాయి. గత కేఎంసీ ఎన్నికలతో పోలిస్తే టీఎంసీ ఈసారి 22 శాతం ఓట్లు ఎక్కువ సాధించింది. బీజేపీకి గతంతో పోలిస్తే ఆరు శాతం తక్కువ ఓట్లు పడ్డాయి.
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కేఎంసీ ప్రాంతంలో సాధించిన ఓట్ల కంటే ఈసారి బీజేపీ ఏకంగా 20 శాతం తక్కువ ఓట్లు పడ్డాయి. విపక్షాల ఓటు బ్యాంక్ను బద్దలుకొట్టాలని టీఎంసీ కుట్ర పన్నిందని, ఆ క్రమంలోనే లెఫ్ట్ ఫ్రంట్ పుంజుకుందని బీజేపీ ఆరోపించింది.