విజయనగరం జిల్లాలో పని చేసే పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు మహిళా సంరక్షణ పోలీసులు, మహిళామిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసు అధికారులను ఆదేశించారు.
పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్సును జిల్లా ఎస్సీ నిర్వహించి, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు, ఇంటిలిజెన్సు వ్యవస్థను మెరుగుపర్చుకొనేందుకు, పోలీసుల సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నియమించిన మహిళా సంరక్షణ పోలీసులు, స్వచ్ఛందంగా పని చేసేందుకు ముందుకు వచ్చిన మహిళామిత్ర సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో ఎంఎస్ పిలు క్రియాశీలకంగా వ్యవహరించే విధంగా చూడాలని, వారితో వారాంతపు, మాసాంతపు సమావేశాలను సంబంధిత పోలీసు అధికారులు నిర్వహించి, వారు నిర్వహించాల్సిన విధుల పై అవగాహన కల్పించి, గ్రామ స్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, అసాంఘిక కార్యకలాపాల సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు.
ప్రజలకు పోలీసులు అందించే సేవలు, మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు, మొబైలు యాప్స్ స్పందన, సైబర్ మిత్ర, మహిళమిత్ర, వృమిత్ర గురించి, డయల్ 100, అత్యవసర సేవలు పొందేందుకు 112, పోలీసు సహాయాన్ని కొరకు వాట్సాప్ 6309898989 పట్ల గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
కాలేజ్ చదివే విద్యార్ధులు వాట్సాప్, ఫేస్ బుక్, మెసెంజరు, యూ ట్యూబు, ఇన్ స్ట్రాగ్రాం వినియోగంలో అత్యధిక సమయాన్ని వెచ్చిస్తూ చదువులను ఏవిధంగా నిర్లక్ష్యం చేస్తున్నది, సోషల్ మీడియా మోజులో ఏవిధంగా మోసపోతునారన్న విషయాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.
సోషల్ మీడియాను వినియోగించే విద్యార్ధులు, మహిళలు, వారి తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలన్నారు.
దత్తత స్వీకరించిన ప్రభుత్వ పాఠశాలను సందర్శించి దిశ యాప్, దిశ చట్టం, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల అవగాహన కల్పించాలని, వారిని చైతన్య పర్చే లఘు చిత్రాలను ప్రదర్శించాలని, పోలీసుల సహాయం పొందేందుకు అవసరమైన ఫోన్ నెంబర్లుతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంచాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ రాజకుమారి జూమ్ కాన్ఫరెన్సులో ఆదేశించారు.