ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కోర్టులో కేసుల విచారణ ప్రారంభం కాగా హైకోర్టు స్టే ఉన్న కొన్ని కేసులు నవంబర్ 9కి వాయిదా పడ్డాయి.
సీఎం జగన్ తరఫు న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కోరారు. హెటిరో, అరబిందోలకు భూకేటాయింపులు, జగతిలో పెట్టుబడులు, పెన్నా ఇండియా, దాల్మియా, భారతి సిమెంట్స్కు లీజులు, ఇందూగ్రూపు, వాన్పిక్కు భూకేటాయింపులు తదితరాలపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులపై విచారణ జరిగింది.
వీటితోపాటు ఎమ్మార్ విల్లాలు, ప్లాట్ల కేటాయింపుపై నమోదైన కేసు, ఓబుళాపురం గనుల లీజు వ్యవహారాలపై నమోదైన కేసులతో పాటు జగన్ కేసుల్లో పెట్టుబడుల నిధుల బదలాయింపుల్లో అవకతవకలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ నమోదు చేసిన 5 కేసులు, ఎమ్మార్ వ్యవహారంపై ఈడీ కేసులు విచారణ కొచ్చాయి.