39.2 C
Hyderabad
April 28, 2024 11: 37 AM
Slider చిత్తూరు

రాక్షస రాజ్యం: టీడీపీ కార్యకర్తల్ని దారుణంగా హింసించిన వైసీపీ నేతలు

#tdp

తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా  ‘బాబుతో మేము’ అంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలోని  కుప్పం నియోజకవర్గానికి సైకిల్ యాత్రకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పుంగనూరులో అడ్డుకొని, అవమానించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాస్వామ్యవాదులు దీనిపైన మండిపడుతున్నారు.

ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి జరిగిన ఘోర అవమానాన్ని గురించి చింతిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం ప్రత్యేక దేశమా అని ప్రశ్నిస్తున్నారు. పుంగనూరులోకి రావాలంటే వీసా పాస్పోర్ట్ అవసరమా అని అడుగుతున్నారు. పుంగనూరు రాజ్యంలో తెలుగుదేశం పార్టీని తీవ్రవాద పార్టీగా ప్రకటించారా అని అడుగుతున్నారు. పుంగనూరులో పసుపు రంగును నిషేధిత జాబితాలో పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు.

భారత రాజ్యాంగం ఎక్కడ వర్తించదా? అని నిలదీస్తున్నారు. పైగా తెదేపా కార్యకర్తలు ఎక్కడా ప్రసంగాలు చేయలేదు. ఎవరినీ రెచ్చకోట్టలేదు. వారిమానాన వాళ్ళు టీ తాగుతుంటే, అలా ప్రవర్తించడం తగదంటున్నారు. పుంగనూరులో  జరిగిన ఈ సంఘటనపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సైకో పాలనలో సైకిల్ తొక్కడం కూడా నేరమా అంటూ ప్రశ్నించారు.

శ్రీకాకుళం  జిల్లాకు చెందిన అచ్చం నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన జిల్లా నుండి చిత్తూరు జిల్లాకు వచ్చిన కార్యకర్తలకు జరిగిన ఘోర అవమానాన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. శనివారం విజయవాడలో జరిగిన తెదేపా విసృత స్థాయి సమావేశంలో ఈ విషయమై ప్రస్తావనకు వచ్చింది. సమావేశం ఈ చర్యను తీవ్రంగా ఖండించింది.

ఈ విషయమై ప్రజాస్వామ్యవాదులు మాట్లాడుతూ పుంగనూరు ఘటన మంత్రి పెద్దిరెడ్డికి తెలిసి, ఆయన ఆదేశానుసారం దిగినదని భావించడానికి వీలు లేదంటున్నారు. అయితే ఇలాంటి చర్యల కారణంగా పార్టీకి, మంత్రి పెద్దిరెడ్డికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కలుగజేసుకుని ఇలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్చిన అవసరం ఉందంటున్నారు.

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ ఉందా అన్న చర్చ కూడా కార్యకర్తల్లో వినిపిస్తోంది. శుక్రవారం సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తలను పుంగనూరు వైకాపా నాయకులు కొందరు అడ్డుకొని, వారి చేతిలోని టిడిపి జండాలు, వారు ధరించిన పసుపు చొక్కాలను విప్పించి పంపించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రామకృష్ణ, రామసూరి,ఆదినారాయణ,సుందర రావు, రమేష్ అక్టోబర్ రెండున సైకిల్ యాత్ర ప్రారంభించారు.

శుక్రవారం నాలుగు గంటలకు పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద టీ తాగడానికి ఆగారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్త సూరి మరి కొందరితో కలిసి వచ్చి సైకిల్ యాత్ర వచ్చిన వారిని దబాయించారు. అసభ్యకరంగా దూషించారు. పుంగనూరు పెద్దిరెడ్డి  అడ్డా, ఇక్కడకి చంద్రబాబునే రానివ్వలేదు, మీరెలా వస్తారు? అంటూ గట్టిగా మందలించారు. సైకిళ్లకు కట్టిన జండాలు పీకించి, వేసుకున్న చొక్కాలు విప్పించి వెనక్కు పంపారు.

రాత్రికి వారు పలమనేరులో బసచేసి శనివారం కుప్పం చేరుకుని యాత్ర ముగిస్తారు.గతంలో లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించిన పాదయాత్ర కూడా పుంగనూరు మీదుగా సాగలేదు. అయితే పుంగనూరు నియోజక వర్గం పులిచర్ల మండలం మీదుగా పీలేరు చేరుకున్నది. ఇటీవల చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కోసం పుంగనూరు వచ్చిన సందర్భంగా అల్లర్లు జరగడం అందరికీ తెలిసిందే.

అందులో చంద్రబాబు సహా పలువురి కేసులు పెట్టారు. జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమరనాద రెడ్డి మరికొందరు  ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పుంగనూరు ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి, మరి కొందరు కొన్నాళ్ళు  జైలులో గడిపి బెయిలుపై బయటికి వచ్చారు. చంద్రబాబు కూడా ఆఖరికి ముందస్తు బెయిల్ పొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పార్టీ నేతలు కార్యకర్తలు పూర్తిగా చేతులు ఎత్తేశారని  కొందరు అంటున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అడ్డా అయిన పుంగనూరు నియోజకవర్గంలో  తొలినుంచి టిడిపి బలహీనంగా ఉంది. 2009లో నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటి నుంచి రామచంద్రా రెడ్డి వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మళ్ళి అయన గెలుపు నల్లేరు మిద నడకే. తెదేపాలో పెద్దిరెడ్డిని ఎదుర్కొనే నేత కూడా లేరు.అంత క్రితం ఆయన మూడు సార్లు పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు.

ప్రస్తుతం పెద్దిరెడ్డి తన నియోజకవర్గాన్ని కంచుకోటగా తయారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ టిడిపి ఇంచార్జి చల్లా రామచంద్రా రెడ్డి, మండలాల అధ్యక్షులు వైసిపికి ధీటుగా  ఎదుర్కోలేక పోతున్నారు. పార్టీ పరిశీలకుడు దంపూరి భాస్కర్ యాదవ్ కూడా నియోజక వర్గంలో తిరగడం లేదని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఇంచార్జిగా ఉన్న అనీషా రెడ్డిని తొలగించి చల్లా రామచంద్రా రెడ్డిని ఇంచార్జిగా నియమించారు.

అక్కడ పరిశీలకులుగా పనిచేయడానికి కూడా నాయకులు భయపడుతున్నారు. దీంతో ఫైర్ బ్రాండ్ అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ని పరిశీలకునిగా నియమించారు. ఆయన మూడు నెలలు పనిచేసి నియోజకవర్గంలో సాగుతున్న కోవర్టు రాజకీయాలు నచ్చక రాజీనామా చేశారు. ఇప్పుడు నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా నిలిచే నాయకులే లేరని అంటున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

మినీ డైరీ యూనిట్లు త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలి

Satyam NEWS

పెదవేగిలో మహిళలకు ఘన సన్మానం

Satyam NEWS

ఈ కాంగ్రెస్ కు బుద్ధి రాదు… వచ్చే అవకాశం కూడా లేదు

Satyam NEWS

Leave a Comment