రాష్ట్రంలో సామాన్యులకు దొరకని ఇసుక, వైసీపీ నాయకులు అండదండలు ఉన్న వారికి మాత్రం సులువుగా దొరుకుతుందని తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తుంటే, మేము అధికారంలోకి వస్తే తక్కువ ధరకు ఇసుక ఇస్తామని చెప్పి నేడు ఇసుకే దొరకకుండా చేసారని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం రవాణా ఛార్జీల మాత్రమే చెల్లించే వారని, అందువలన ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలకు ఇంటికి చేరేదని ఆయన అన్నారు.
అయితే నేడు ఒక ట్రాక్టరు ఇసుక 4 వేలు పెట్టినా దొరకడం లేదని, ఇళ్ల యజమానులు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నా ఇసుక దొరకడం లేదని ఆయన అన్నారు. అదే అధికారపార్టీ వారిని సంప్రదించి వారు అడిగిన ధర ఇస్తే మాత్రం ఎంత ఇసుక అయినా దొరుకుతుందని ఆయన ఆరోపించారు.
వైసీపీ నాయకులు అండదండలతో యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని, రాష్ట్రంలో ఇసుక కష్టాలు వలన భవన నిర్మాణ రంగం కుదేలయిందని వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్న ట్రాక్టరు ఇసుక 4 వేలు పెట్టి కొనలేక ఇంటి నిర్మాణాలనే వాయిదా విసుకుంటున్నారని దీని వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్థులు ఉంటున్నారని ఆయన అన్నారు.
వైసిపి నాయకులు ఇసుక దోపిడీ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటే ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు రిచ్ లలో సి సి కెమెరాలు ఆపివేసి ఒకే పర్మిట్ మీద అనేక ట్రిపులు ఇసుక తరలిస్తున్నారని ఆయన అన్నారు.
అదే విధంగా ఆన్ లైన్ నమోదు చేసుకోవడానికి మీ సేవ కేంద్రాలకు వెళితే సర్వర్ పనిచేయలేదంటారని ఆయన అన్నారు. అదే వైసీపీ నాయకులు దగ్గరికి వెళ్లి వారు చెప్పిన ధర ఇస్తే ఎంత ఇసుక అయినా దొరుకుతుందని దీనిని బట్టి రాష్ట్రంలో అధికారపార్టీ కను సన్నలలో ఇసుక రిచ్ లు నడుస్తున్నాయని అర్ధమవుతుందని వెంకటేశ్వరరెడ్డి అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, శివుని రమణారెడ్డి, పాలపర్తి శ్యాం, ఇందుపురు మురళీ కృష్ణారెడ్డి, అగ్గి మురళి,పి ఆదిశేషయ్య, ఇంటూరు విజయ్,సాయి రోశయ్య మస్తాన్,గరికిపాటి అనిల్,బాబు, తదితరులు పాల్గొన్నారు.