చంద్రబాబు అండ చూసుకోని టీడీపీ నాయకులు దుర్మార్గాలకు పాల్పడుతున్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. విజయవాడ నగరంలో టీడీపీ నాయకుడు జైన్ చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని, మహిళా లోకాన్ని కలచివేసిందని ఆయన అన్నారు.. టీడీపీ కిరాతకుడు చేసిన ఘాతుకానికి నిరసనగా నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నరసరావుపేట పట్టణంలోని డా.బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
తర్వాత దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… వినోద్ జైన్ వేధింపులు భరించలేక 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడం బాధకరమన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళా భద్రత కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ప్రత్యేక చట్టాలను, పాలసీలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు ఎంతటి దుర్మార్గాలకు పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఒక మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకొని కొట్టడం, కాల్ మని పేరుతో టీడీపీ నాయకులు దూరాఘతాలకు పాల్పడటం, మహిళను వివస్త్రను చేసి కొట్టడం లాంటి ఎన్నో ఘటనలు ఉన్నాయన్నారు. స్వయంగా చంద్రబాబు నాయుడు ఆడబిడ్డల పుట్టుక గురించి మాట్లాడటం, నారా లోకేష్ మహిళల గురించి అవహేళనగా మాట్లాడటం చూశామన్నారు. టీడీపీ ముఖ్య నాయకులు మహిళలను చిన్న చూపుతో చూడటం వలనే వినోద్ జైన్ లాంటి నాయకులు తయారవుతున్నారని గోపిరెడ్డి మండిపడ్డారు. మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడే వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని సీఎం జగన్ ఎన్నో సందర్భాలలో పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. బాలిక మరణానికి కారణమైన టీడీపీ నాయకుడు వినోద్ జైన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ మహిళా సంఘాల నాయకులు సయ్యద్ ఫాతిమా, స్వఛ్ ఆంధ్రా కార్పొరేషన్ డైరెక్టర్ సుజాతా పాల్, వైసీపీ నాయకురాలు అనురాధ రెడ్డి, అనీలా, షేక్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆషా బేగం ఖాజావలి, ఇతర మహిళా నాయకులు,మహిళా సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు.