రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం కోసం సీనియర్ ఎమ్మెల్యే లు, ముఖ్య మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్ల తరువాత మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేస్తానని ముఖ్య మంత్రి అయిన కొత్తలో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినా గడువు ముగిసిన తర్వాత కూడా ఆ ఛాయలు కనిపించడం లేదు.
ఇప్పట్లో మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. దాంతో సీనియర్ ఎమ్మెల్యే లలో తీవ్ర అసంతృప్తి తొంగి చూస్తున్నది. దానితో బాటు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్వయంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పిన దరిమిలా మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అనే అనుమానం అందరిలో ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడే మంత్రి పదవులు సాధించుకోవాలనే ఆశతో ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే రెండు సంవత్సరాల పాటు కరోనా తో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మళ్లీ ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న తరుణంలో మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అంతా సవ్యంగా ఉండి ఉంటే ఈ పాటికి ఏపీలో మంత్రివర్గం మారేదేనేమో. అయితే వరసగా రెండేళ్ల పాటు కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాజకీయ కార్యకలాపాలు కూడా అంత సాఫీగా జరగలేదు. ఇప్పుడు మూడో వేవ్ లో కరోనా విజృంభిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రివర్గ మార్పు చేర్పుల గురించి సీఎం ఆలోచించకపోవచ్చు కూడా.
దీంతో కనీసం మరో రెండు మూడు నెలల పాటు ఈ అంశం వెనక్కు వెళ్లినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు మరో రెండేళ్లకు కాస్త ఎక్కువ సమయం ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్ ఎప్పుడు మంత్రివర్గాన్ని మారుస్తారనే అంశం గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది.
మంత్రి పదవుల గురించి ఆశలో రాయలసీమ నేతలే ముందు వరసలో ఉన్నారు. ఆశావహుల జాబితా రాయలసీమ నుంచినే ఎక్కువగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉంది. ఎప్పుడెప్పుడా అని ఈ నేతలు ఎదురుచూస్తున్నా ఈ అంశం కార్యరూపం దాల్చడం లేదు. మరి ఏపీ మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఎప్పుడన్న ప్రశ్న నేతల్లో గుబులు పుట్టిస్తోంది.
జగన్ వర్గం ఎక్కడ..?
దాదాపుగా ప్రతి పార్టీలోనూ అధినేత సామాజిక వర్గానికి చెందినవారు ఓ కోటరీలాగా ఆయన చుట్టూ ఉంటారు. ఆయనపై పల్లెత్తు మాట పడకుండా చూసుకుంటుంటారు. కానీ వైసీపీలో మాత్రం జగన్ సామాజిక వర్గం కొంతవరకే పరిమితం అయింది. వాస్తవానికి జగన్ కి ఏ కోటరీ లేదు. ఆయన చుట్టూ ఉన్నవారిలో అన్ని సామాజిక వర్గాల వారూ ఉన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదు. వైఎస్ఆర్ చుట్టూ అప్పట్లో ఆయన సామాజిక వర్గం నేతలు బలంగా నిలబడ్డారు. కానీ జగన్ హయాం వచ్చే సరికి వారెవరూ దరిదాపుల్లో లేరు.
బల పడుతున్న కుల రాజకీయాలు
ఏపీలో కులరాజకీయాలు బలంగా ఉన్నాయనే వాదన ఉంది. వైసీపీ, టీడీపీ లు పూర్తిగా కులం కార్డునే వాడుతున్నాయి. జనసేన కూడా ఆ వైపు వెళ్లాలని చూస్తున్నా లాభం లేదేమోననే మీమాంసలో ఉంది. కాంగ్రెస్ కూడా కాపుల నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ దింపుడు కళ్లెం జోకులు పేలుస్తోంది. బీజేపీకి ఎటూ వెళ్లే అవకాశం లేదు, అందుకే మత రాజకీయాలని నమ్ముకోవాలని చూస్తోంది.
దూరమైన సొంత సామాజిక వర్గం
వైసీపీ విషయానికొస్తే జగన్, సొంత సామాజిక వర్గానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు, అందుకే ఆయన అందరివాడయ్యారు, ఆయన చుట్టూ అందరూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా అధినేతని ఎవరైనా టార్గెట్ చేస్తే మిగతావర్గాల నుంచి వచ్చినంత స్పందన సొంత సామాజిక వర్గం నుంచి కనిపించకపోవడం మాత్రం విశేషం. జగన్ హయాంలో నోరున్న నేతలెవరు అంటే, టాప్ 5లో ఆయన సొంత సామాజిక వర్గం నుంచి ఒక్కరూ లేకపోవడం విచిత్రం అనిపిస్తోంది. అయితే ఆయన ఇచ్చిన పదవులన్నీ రెడ్లకే దక్కడంతో ఆయనపై రెడ్డి ముద్ర బలంగా ఉంది.