ఇంఛార్జ్ లేకపోయినా దర్శిలో నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషితో యువగళం పాదయాత్రను సూపర్ హిట్ చేశారని యువనేత నారా లోకేష్ సంతోషం వ్యక్తంచేశారు. వినుకొండ నియోజకవర్గం పుచ్చనూతలలో దర్శి నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జుల లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను అభినందించారు. లోకేష్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరిలో పట్టుదల ఉంది. దర్శిలో మనం గెలవబోతున్నాం…మంచి మెజారిటీ సాధించాలి. నిత్యం ప్రజల్లో ఉండే బలమైన అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం. ఎన్నికల తర్వాత ఇన్చార్జి వ్యవస్థ ఉండదు అని ఆయన తెలిపారు.
2024 ఎన్నికల తర్వాత ఇంఛార్జ్ ల వ్యవస్థ ఉండదు. మండల, గ్రామ కమిటీలను బలోపేతం చేస్తాం. మండలాలు, క్లస్టర్లలో బాధ్యులు పార్టీని పటిష్టం చేయాలి. కమిటీల్లో ఉన్న ప్రతి ఒక్కరూ పని చేయండి. భవిష్యత్తకు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. వర్గ విభేధాలుంటే పక్కన పెట్టాల్సిందేనని ఆయన తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో బాగా ఇబ్బంది పడ్డారు. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. తప్పుడు కేసులతో మిమ్మల్ని వేధించిందని ఆయన అన్నారు. సీఎం సామాజికవర్గంలోనూ జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. దొంగ ఓట్లపై దృష్టి పెట్టండి. మీరు అప్రమత్తంగా ఉంటే ప్రజల ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్చడం కుదరదు. పార్టీ తరపున చేయాల్సిన కార్యక్రమాలపై ఇక గట్టి ఫోకస్ పెట్టాలని లోకేష్ కోరారు.