ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 652 జడ్పిటిసీ స్థానాలకు 4 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. 9696 ఎంపీటీసీ స్థానాలకు 50 వేల 63 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 14వరకు గడువు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైసీపీ జోరు కొనసాగిస్తుంది. చాలా స్థానాల్లో ఒక్కొక్క నామినేషనే దాఖలవడంతో ఏకగ్రీవమవుతున్నాయి. ఉపసంహరణ గడువైన 14వ తేదీ నాటికి మరికొందరు ఉపసంహరించుకుంటే మరికొన్ని స్థానాలూ ఏకగ్రీవం కానున్నాయి.
ఈ మేరకు ఎక్కడికక్కడ రాజీ యత్నాలు రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చాలా ఎంపీటీసీ స్థానాల్లో ఒకటే నామినేషన్ దాఖలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని 71 స్థానాల్లో 60 సీట్లలో వైసిపి ఏకగ్రీవంగా ఎన్నికైంది. వెల్దుర్తి మండలంలోని 14 స్థానాల్లో ఒకే నామినేషన్ వేశారు.
పలు మండలాల్లో వైసిపి అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు. రెంటచింతల 13 దుర్గి 12 మాచర్ల 9 కారంపూడి 9 నరసారావు పేటలోని 6 స్థానాల్లో ఒకే నామినేషన్ దాఖలు చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో 6 చోట్ల వైసీపీకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో 2 చోట్ల వైసిపి ఏకగ్రీవమైంది. మరిన్ని స్థానాల నుంచి సమాచారం రావాల్సి ఉంది.