కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 108 డ్రైవర్ మృతిచెందడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేడు సంచలనం సృష్టించింది. కరోనా వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తలకు, పారిశుద్ధ్య పని వారికి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.
గత రెండు రోజుల నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్నది. నిర్మల్ జిల్లా కుంటాలకు చెందిన 108 వాహనం డ్రైవర్ కూడా ఇదే విధంగా వ్యాక్సిన్ తీసుకున్నాడు. అయితే ఆయన నేటి తెల్లవారు జామును అకస్మాత్తుగా మరణించాడు.
దాంతో ఒక్క సారిగా వార్త గుప్పుమన్నది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి మరణించడంతో అధికారులు హుటాహుటిన రంగంలో దిగారు. 42 సంవత్సరాల విఠల్ 19వ తేదీన నిర్మల్ జిల్లా కుంటాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ తీసుకున్నాడని అధికారులు తెలిపారు.
20వ తేదీ అంటే నేడు తెల్లవారు జామున ఛాతీ నొప్పి వచ్చినట్లు అతను చెప్పడంతో కుటుంబ సభ్యలు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారని అధికారులు తెలిపారు. అయితే అతను తెల్లవారు జామున మరణించాడని అయితే అతని మరణానికి వ్యాక్సిన్ కారణం కాదని జిల్లా వైద్య అధికారులు తెలిపారు.
వైద్యుల బృందం పోస్టు మార్టం నిర్వహిస్తుందని, మరణానికి అసలు కారణాన్ని కనుగొంటామని వైద్య అధికారులు తెలిపారు.