2020 ప్రపంచంలో మానవాళికి సంతోషం కంటే దుంఖాన్నే ఇచ్చిందని చెప్పొచ్చు. నూతన సంవత్సరం ప్రారంభంలో జోష్ ఉన్నప్పటికీ ఆ మరుసటి నెలలోనే ఫిబ్రవరిలోనూ భారత్పై కరోనా పంజా విసరడంతో ఇక అక్కడి నుంచి భారతీయుల, ప్రపంచ దేశాల ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు అన్ని దేశాలు ఆర్థికంగా కుదేలైతే, మరోవైపు సగటుజీవి మాత్రం కష్టాల ఊబిలో చిక్కుకుపోయాడు. ఇక సుప్రీం కోర్టు నిర్ణయాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఎడతెగని పంచాయతీల బంధనాల నుంచి విముక్తులను చేయగా ఆయా రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీలు గద్దెనెక్కాయి. మొత్తానికి 2020 కాస్త శుభారంభాన్నిచ్చిన, సంవత్సరమంతా నిరాశ, ఆందోళనకర సంవత్సరంగానే నిలిచిందని చెప్పొచ్చు.
ఇక 2020లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1,616,1919 మందిని పొట్టన పెట్టుకోగా అనేకమంది ఆసుపత్రుల పాలయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఇంతమంది చనిపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేత నితీష్ కుమార్ పార్టీ విజయఢంకా మోగించింది.
2020లో ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీకి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ 62 స్థానాలలో గెలుపొంది ఎన్నికయ్యారు.
ఇక పౌరసత్వ చట్టంపై భారత్ 10 జనవరి 2020 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విషయంపై 2019డిసెంబర్లోనే పార్లమెంట్లో ఓటింగ్ జరగగా పౌరసత్వ చట్టానికి అనుకూలంగా 311 మంది సభ్యులు ఓటేశారు.
ఈ చట్టంపై ఢిల్లీలో ఫిబ్రవరిలో షహీన్బాగ్ వేదికగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. చట్టాన్ని రద్దు చేయాలని భారీ నిరసనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అల్లర్లు చోటు చేసుకొని 53 మంది మరణించగా 600మందికి పైగా గాయపడ్డారు.
ఇక కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పార్లమెంట్ ముట్టడికి పంజాబ్,హర్యాణా, ఒడిస్సా రైతులే గాకుండా అనేకమంది రైతులు ఉద్యమించారు. ఈ నేపథ్యంలో నవంబర్ నుంచి రైతులు చేపడుతున్న ఆందోళనలు కాస్త తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆందోళనలు ఇంకా కొనసాగుతుండడం విశేషం.
ఇక 2020 సంవత్సరంలో అత్యంత సాహసోపేత నిర్ణయం ఏదైనా ఉందంటే అది అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అనే చెప్పొచ్చు. 9 నవంబర్ 2019నే తీర్పు చెప్పినప్పటికీ ఆగస్టు 5వ తేదీన ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. బాబ్రీ కూల్చివేత కేసులో మాత్రం
నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ కోర్టు 32 మందిపై ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు కొట్టివేసింది. 28 ఏళ్ల తరువాత ఈ తీర్పు వెలువడడం దేశంలో ఓ సంచలనంగా చెప్పుకోవచ్చు. అత్యంత ఎక్కువ రోజులు నడిచిన కేసుగా కూడా అయోధ్య, బాబ్రీ కూల్చివేత కేసులను పరిగణించొచ్చు.
జీహెచ్ఎంసీ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ లభించలేదు. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్కు రెండు మాత్రమే సీట్లు లభించాయి.