ప్రపంచ దేశాలన్నింటిలో కష్టజీవులు అందరూ జరుపుకునే ఏకైక పోరాట స్ఫూర్తి పండగ మేడే పండుగని మే ఒకటో తేదీన పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు హుజూర్ నగర్ పట్టణంలో జరిగే ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్ కార్మికులకు పిలుపునిచ్చారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగ కార్మికులతో రోషపతి,సోమయ్య గౌడ్ మాట్లాడుతూ 1886 సంవత్సరంలో అమెరికా చికాగో నగరం హే మార్కెట్ లో 8 గంటల పని విధానం అమలు కొరకు,వేట్టిచాకిరి విముక్తి కొరకు,కనీస వేతనం కొరకు కార్మికులు సాగించిన వీరోచిత పోరాట ఫలితంగా ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు.
సుదీర్ఘ పోరాటాల ద్వారా భారతదేశంలో సాధించుకున్న 29 కార్మిక హక్కులను హరించే బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చడంపై మరో పోరాటానికి కార్మికవర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం మన దేశంలో ఫ్యాక్టరీ పరిశ్రమలన్నింటిని దెబ్బ తీస్తూ ఇదే సమయంలో ఆత్మ నిర్బెర్ భారత్ అని నినాదంతో పెట్టుబడిదారులకు ఉద్దీపన పథకాల అందిస్తూ భూములు,ఖనిజ వనరులు, జలాశయాలు,అడవులు,మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజల శ్రమతో నెలకొల్పబడ్డ ప్రభుత్వరంగ సంస్థలను మొత్తం అన్నిటినీ కట్టపెడుతోందని విమర్శించారు.రాజకీయ ప్రయోజనాల కోసం మతం,కులం,ప్రాంతం,భాష పేర్లతో ప్రజలను,కార్మిక వర్గంలో చీలకలు తెస్తుందని తీవ్రంగా ఆరోపించారు. కేంద్ర కార్మిక సంఘాలు రూపొందించిన 13 డిమాండ్ల సాధన కోసం 2022 మార్చి 28,29న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతమైందని,కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ తో మరిన్ని హక్కుల సాధించాలంటే మేడే స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలు కొనసాగించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ,మెరుగ దుర్గారావు,కస్తాల సైదులు,రవి,కుమారి, దేవకర్ణ,గోపి,సంతోషం,చంద్రకళ, రాంబాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్