రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవ రత్నాలలో ఒకటి రాలిపోయిందని నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్, బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
గత సంవత్సరం కరోనా సమయంలో పాఠశాలలు, కాలేజీలు తెరవకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటు బ్యాంకును కాపాడుకోవటానికి అమ్మఒడిని ఇచ్చారు. కానీ, ఈ సంవత్సరం పాఠశాలలు తెరిచినా 75% హాజరు అంటూ కొత్త నిబంధనను పెట్టి నవరత్నాలలో ఒక రత్నానికి తూట్లు పొడిచే కార్యక్రమానికి తెరతీశారు అని ఆయన విమర్శించారు.
అలాగే, కాలేజీలకు బకాయిపడ్డ 1000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోవడం వలన విద్యార్థులు కోర్సు పూర్తిచేసినా సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
దీనినిబట్టి వైసీపీ ప్రభుత్వానికి విద్యార్థుల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రచారం, ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని అర్థమవుతోందని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల ఉన్నత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని ఆయన తెలిపారు.