ఏపీ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, వారి సొంత పార్టీ లోక్ సభ సభ్యుడు కనుమూరి రఘు రామకృష్ణ రాజు మధ్య జరుగుతున్న పోరు ఆసక్తికరంగా ఉంది.
ఏడాదిన్నరగా సాగుతున్న రచ్చ క్లైమాక్స్ కు చేరుకున్నది. జగన్ బెయిలు రద్దయి జైలుకు వెళతారా లేక రాజు అనర్హత వేటుకు గురై ఇంటికి వెళతారా అన్నది రెండు మూడు నెలల్లో తేలిపోతుంది.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రాజు సీబిఐ కోర్టులో వేసిన పిటిషన్ పై జూలై ఒకటి నుంచి విచారణ జరగనున్నది. సీబీఐ కోర్టులోనే బెయిల్ రద్దవుతుందని రాజు విశ్వసిస్తున్నారు.
అక్కడ కాకుంటే హై కోర్టు, ఆ పై సుప్రీం కోర్టుకు వెళ్ళయినా బెయిల్ రద్దు చేయించాలన్న పట్టుదల రాజులో కనిపిస్తోంది.
కాగా రఘు రామకృష్ణ రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ఎంపిలు స్పీకర్ కు విజ్ఞప్తి చేసి ఉన్నారు.
అలాగే ఎపి సిఐడి పోలీసులు పెట్టిన రాజద్రోహం కేసులో రాజు బెయిల్ పొంది ఢిల్లీలో ఉన్నారు. అక్కడి నుంచే ఆయన పార్టీ వైఫల్యాలపై జగన్ కు లేఖలు రాసి నిలదీస్తున్నారు.
తాజాగా సుప్రీం కోర్టు వెలువరించిన రెండు వేర్వరు తీర్పుల్లో రాజద్రోహం చెల్లదని, పార్టీని ప్రశ్నించడం వ్యతిరేక కార్య కలాపాల కిందకు రాదని వెల్లడించింది.
కాబట్టి రాజుకు కేసుల వల్ల భయం లేదని తేలిపోయింది. తాజా పరిణామాల నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దయి, జైలుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే తీర్పులు వచ్చే వరకు దేనిని నమ్మకంగా చెప్పలేము. కాబట్టి కొద్దిరోజుల వరకు వేచి చూడక తప్పదు.
– డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్