రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) డాక్టర్ ఎన్.రమేష్కుమార్ కేంద్ర హోంశాఖ కు రాసిన లేఖ కు సంబంధించిన వ్యవహారంలో సీఐడి విచారణపై అమరావతి హైకోర్టు స్టే విధించింది.
పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ రాష్ట్రంలో తలెత్తిన శాంతి భద్రతల అంశంపై కేంద్ర హోం శాఖ కు లేఖ రాస్తూ తనకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని కోరారు.
అయితే ఈ లేఖ ఆయన రాసింది కాదని, తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేసి ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ లేఖ తానే రాశానని రమేష్ కుమార్ చెప్పినా సిఐడి అధికారులు పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సహాయ కార్యదర్శి సాంబమూర్తి ని సిఐడి పోలీసులు విచారణ నిమిత్తం తరలించారు కూడా.
ఈ అంశాల తదనంతర పరిణామాలలో సుప్రీంకోర్టు స్టే నిరాకరణ, రాష్ట్ర గవర్నర్ చొరవతో రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. కేసుల నమోదు కారణంగా ఉద్యోగులు తమ విధులను నిర్వహించలేకపోతున్నారని ఎస్ఈసీ రమేష్ కుమార్ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు.
లేని అధికారాలను ఆపాదించుకుని సిఐడి పోలీసులు ఎన్నికల సంఘం కార్యాలయంలోకి ప్రవేశించడం, ఎన్నికల సంఘం అధికారులపై కేసులు పెట్టడం, కంపూటర్లు ఎత్తుకెళ్లడం రాజ్యాంగ విరుద్ధమని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది డి వి సీతారామమూర్తి కోర్టుకు విన్నవించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 21న సిఐడి నమోదు చేసిన ఎఫ్ ఐ ఆర్ చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. కేసుతో ఎలాంటి సంబంధం లేకపోయినా సహాయ కార్యదర్శి సాంబమూర్తి ని పోలీసులు వేధించారని, మానసిక వేదనకు గురి చేశారని ఆయన తరపు న్యాయవాది ఎన్.అశ్విని కుమార్ కోర్టు కు తెలిపారు.
పిటీషన్ను విచారించిన కోర్టు ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. తదుపరి విచారణ నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారనే వివరాలను కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.