31.7 C
Hyderabad
May 2, 2024 09: 18 AM
Slider సంపాదకీయం

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

#Kalvakuntla Kavita

బీఆర్ఎస్ పార్టీ తన ముఖచిత్రాన్ని మార్చుకోవాలని చూస్తున్నదా? ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని చూసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నది. తమది ప్రాంతీయ పార్టీ కాబట్టి రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ వేదిక కాబోతున్నదనే అనుమానం బీఆర్ఎస్ పార్టీకి కలుగుతున్నది.

దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొంటే తప్ప తాము మనుగడ సాగించలేమని బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే బీజేపీకి ప్రధాన స్లోగన్ అయిన హిందూత్వ విధానాన్ని అనుసరించాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. రాష్ట్రంలో క్రమంగా మజ్లీస్ పార్టీ కూడా బీఆర్ఎస్ కు దూరం అయి కాంగ్రెస్ కు చేరువ అవుతున్న సంకేతాలు పంపుతున్నది. దాంతో తాము హిందూత్వ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఇది వర్కవుట్ అయితే రాష్ట్రంలో బీజేపీ పెరగకుండా నిలిచిపోతుందని, తమకు రాజకీయంగా మళ్లీ స్థానం సుస్థిరమౌతుందని బీఆర్ఎస్ అనుకుంటున్నది.

అందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనూహ్యంగా హిందూత్వ వాదం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ హిందూత్వ వ్యతిరేక శక్తిగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి, జాతీయ మీడియాను సైతం ఆహ్వానించి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆరోపించారు.

ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కర్ణాటకలో హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని అన్నారు. డీఎంకేను కూడా వివాదంలోకి తీసుకొచ్చి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ నాయకులు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత అంటున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక రాష్ట్రంలో ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదని సూచించారు.

ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారిగా ఉండాలని డిమాండ్ చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిషేధం ఎత్తివేతపై వెనుకాడుతోందని తప్పుబట్టారు. హిజాబ్ విషయంపై కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పింది చేయకపోవడం కాంగ్రెస్ డీఎన్ఏ అని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని ధ్వజమెత్తారు. గతంలో రామ మందిరంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కవిత ఇటీవల ప్రశంసిస్తున్నారు. కవిత తీరు చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Related posts

సెయింట్ ఆన్స్ విద్యార్థిని రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక

Satyam NEWS

దళిత బంధు రాష్ట్రం మొత్తం వెంటనే అమలు చేయాలి

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: ఆ నలుగురికి ఉరి అమలు

Satyam NEWS

Leave a Comment