ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి ఈ నెల 17 నాటికి సంవత్సరం పూర్తి కావస్తున్నది. ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు కానీ ఆ పార్టీ నాయకులు మాత్రం మళ్లీ అదే అదే పదే పదే చెబుతూనే ఉన్నారు.
సచివాలయంలో సోమవారం సాయంత్రం సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీల ప్రారంభం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ప్రస్తుత సచివాలయంలో ఉద్యోగులకు సరైన వసతులు లేవని నూతన రాజధానిలోని సచివాలయంలో సకల వసతులతో పాటు క్రీడలకు ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేస్తామని సజ్జల ప్రకటించడంతో ఉద్యోగులు హర్షద్వానాలు చేశారు. సజ్జల వ్యాఖ్యలకు స్పందించిన అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయంలో ఆటల పోటీలు నిర్వహించేందుకు టెంట్లు వేసేందుకు రాజధాని ప్రాంత వాసులు సహకరించలేదన్నారు.
ఈ ప్రాంత వాసులు సచివాలయంకు వ్యతిరేకంగా ఉన్నట్లు అర్థమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంను వీలయినంత త్వరలో నూతన రాజధానికి తరలిస్తే ఉద్యోగులు రావడానికి సిద్ధంగా ఉన్నారని ప్రకటించడంతో మరోసారి సభలో కరతాళ ధ్వనులు మోగాయి.
సోమవారం రాజధాని ప్రాంతంలోనే జరిగిన కిసాన్ సభలో అమరావతిలో రాజధాని ఉండాలనేది బిజెపి లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రకటించారు. ఇదే సమయంలో సజ్జల నూతన రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అమరావతిలోనే రాజధాని ఉండాలని, ఉంటుందని సోము వీర్రాజు విస్పష్టంగా ప్రకటించారు.