విజయనగరం జిల్లా బొబ్బిలి లో పురాతన వేణు గోపాల స్వామి దేవాలయ ఆస్థులపై దేవాదాయశాఖ దర్యాప్తు చేసింది. నిన్ననే కలెక్టరేట్ లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. దేవాదాయశాఖ అధికారులతో సమీక్షించారు కూడ.
దరిమిలా.. బొబ్బిలి శ్రీవేణుగోపాలస్వామి ఆలయం ఆస్తులపై దేవాదాయ శాఖ రాష్ట్ర రీజనల్ జాయింట్ సెక్రటరీ భ్రమరాంబిక దర్యాప్తు చేశారు.
కలెక్టరేట్లో ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష మండలి సమావేశంలో ఆలయ ఆస్తులపై దర్యాప్తు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు కోరగా మంత్రి ఆదేశాలు మేరకు ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేశారు.
వేణుగోపాలస్వామి ఆలయం రికార్డులను పరిశీలించారు. భూములు, బంగారం బ్యాంకు లాకర్ రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా భ్రమరాంబిక మాట్లాడుతూ ఆలయం ఆస్తులపై దర్యాప్తు చేయాలని మంత్రి ఆదేశించడంతో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆస్తులపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అనంతరం ఆలయ ధర్మకర్త బేబినాయనను కలిసి వివరాలు సేకరించారు.
ఆలయ భూములకు హద్దులు గుర్తించాలి
శ్రీవేణుగోపాలస్వామి ఆలయం భూములపై సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని ఆలయ ధర్మకర్త బేబినాయన కోరారు.
ఆలయం భూములపై హైకోర్టులో కేసు వేయగా భూములపై సర్వే చేసి సరిహద్దులు గుర్తించాలని అధికారులను కోర్టు ఆదేశించినట్లు చెప్పారు. దేవాదాయశాఖ అధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి ఆలయం భూములు, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు.