ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు విచారణ జులై 11న చేపడతామని జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన బెంచ్ వెల్లడించింది. మూడు రాజధానుల అంశంపై తొందరపాటు ప్రదర్శిస్తున్న జగన్ ప్రభుత్వానికి ఇది కోలుకోలేని దెబ్బగా మారుతుందనడంలో సందేహం లేదు.
జులై 11 కన్నా ముందు కేసు విచారణ సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ముందుగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు ఎంతగా విన్నవించినా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పదే పదే ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. తమ స్టే పిటీషన్ ను విచారణకు స్వీకరించాలని కూడా పదే పదే కోరారు.
అయితే సుప్రీంకోర్టు వాటిని ఖాతరు చేయలేదు. మూడు రాజధానుల చట్టాలను ఉపసంహరించుకున్న తరువాత ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు అర్ధం లేదని ఏపీ తరపు సీనియర్ కౌన్సిల్ కెకె వేణుగోపాల్ వాదించారు. అయినా ఏపీ ప్రభుత్వ లాయర్లు చేసిన విజ్ఞప్తులను న్యాయమూర్తి జస్టిస్ కె ఎం జోసెఫ్ పట్టించుకోలేదు. జస్టిస్ కె ఎం జోసెఫ్ జూన్ 16వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.
అందుకే కేసు విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో జులై 11న వేరే ధర్మాసనం ముందు అమరావతి కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. తను రిటైర్ అవుతున్నందున అమరావతిపై సుదీర్ఘ వాదనలు విని జడ్జిమెంట్ రాసేందుకు సమయం లేదని న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ తేల్చి చెప్పారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కొంతమంది రైతులు చనిపోయారని ప్రతివాదుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
మరణించిన వారి తరపున ప్రతినిధులు ప్రతివాదులుగా ఉండేందుకు న్యాయవాదులు అనుమతి కోరారు. అనుమతించి… వారికి నోటీసులు పంపాలని ప్రభుత్వ న్యాయవాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది.