తెలంగాణ నుండి ఆంద్రప్రదేశ్ కి అక్రమంగా మద్యం తరలిస్తున్న అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామానికి చెందిన గుడివాక అంజిబాబు ని గుంటూరు స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. గుడివాక అంజిబాబు 2019 ఎన్నికలలో మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేశారు.
అంజిబాబు వద్ద నుండి సుమారు 6 లక్షల రూపాయల విలువగల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఈ బి అదనపు ఎస్పీ తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు తరలిస్తుండగా గుంటూరు వద్ద ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి అధ్వర్యంలో పట్టుకున్నారు.
వీరి వద్ద నుంచి 40 కేసుల(1920 మద్యం సీసాల)ను, 3 కారులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 6 లక్షలు ఉంటుందని ఎస్ఈబీ అదనపు ఎస్పీ ఆరిఫ్ హాజిఫ్ తెలిపారు. నిందితులు గుడివాక రామాంజనేయులు, మచ్చా సురేశ్, కె. నరేశ్, గంటా హరీశ్లుగా పోలీసులు గుర్తించారు.
వీరిలో భాజపా నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబు ఎ-1 నిందితుడని అధికారి చెప్పారు. ఈయన 2019లో మచిలీపట్నం భాజపా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.