సర్పంచ్ లకు రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం కుచ్చు టోపీ పెడుతోందని సర్పంచ్ లు నేరుగా బిజెపి కి వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు 6వ రోజు బీజేపీ ప్రజాపోరు వీధి సభలు నిర్వహించింది. రాష్ట్రంలో మొత్తం 580 చోట్ల సభలు నిర్వహించినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాపోరు సభల కార్యక్రమం ఇన్ఛార్జి ఎస్.విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు బాపట్లలో, ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్ విశాఖజిల్లాలో, వాకాటి నారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో, భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్ఛార్జి సునిల్ దేవధర్ పార్వతీపురుంలొను, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ విశాఖలోను, భాజపా జాతీయ కార్యవర్గసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమారరాజు విశాఖపట్నం జిల్లాలో, రాజ్యసభ మాజీ సభ్యులు టీజే వెంకటేష్ కర్నూలులో, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, విష్ణువర్ధన్రెడ్డి తిరుపతిలో, బిట్రా శివన్నారాయణ పశ్చిమగోదావరి జిల్లాలో, సూర్యనారాయణరాజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో బిజెపి కార్యకర్తలతో కలసి జనసేన కార్యకర్తలు కూడా ప్రజాపోరు సభల్లో పాల్గొన్నారు.
అంబేద్కర్ కోన సీమ జిల్లాలో స్దానిక నాయకులు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో ప్రజాపోరు సభలు కొనసాగాయి. గోదావరి జిల్లాలో కాల్వలు ఆధునీకరించలేదని ఫిర్యాదులు వచ్చాయి. ఇసుక అందని ద్రాక్షలా తయారైందని పలువురు ఫిర్యాదు చేశారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను ప్రాంతీయ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయంటూ స్థానికులు ఫిర్యాదులు చేశారు. ఎనిమిదేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పథకాలు, అమలుచేస్తున్న కార్యక్రమాలు తప్ప రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని భాజపా నేతలు ప్రజాపోరు వీధి సమావేశాల్లో పేర్కొన్నారు.
పైగా మోదీ ఇచ్చే నిధులు తీసుకుని వైకాపా స్టిక్కర్లు వేసుకుని తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. భాజపా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాపోరు వీధి సమావేశాలు సందడిగా జరిగాయి. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా ఉండటానికి కారణం కుటుంబ, వారసత్వ ప్రాంతీయ పార్టీలేనని భాజపా నాయకులు విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయి ప్రజల దృష్టి మరల్చేందుకు అనవసర విషయాలపై చర్చ జరిగేలా ప్రభుత్వం పనితీరు ఉందని దుయ్యబట్టారు.