ఇంటి స్థలం వివాదంలో లంచం డిమాండ్ చేసిన ఓ ఎస్ ఐ ని కర్నూలు జిల్లా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కోడుమూరు నియోజకవర్గం సి బెళగల్ మండలంకు చెందిన ప్రకాష్ ఆచారి అనే వ్యక్తి తన ఇంటి పక్క స్థల వివాదంలో ఈ బెళగల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు.
అక్కడ ఎస్సై శివాంజనేయులు ను స్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు. అందుకు సంబంధించి డాక్యుమెంట్లను చూపారు. ఆ స్థల వివాదాన్ని పరిష్కరించాలంటే తనకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో కంగు తిన్న ప్రకాష్ ఆచారి ఆ సొమ్ము ఇచ్చేందుకు మొదట నిరాకరించాడు. ఆ తర్వాత విషయాన్ని కర్నూలు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలిపాడు.
వారి సూచనల మేరకు కర్నూలు కలెక్టరేట్, మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలోని మాంటిస్సోరి స్కూలు వద్ద రూ. 50 వేలు ఇచ్చేందుకు బాధితుడు సిద్ధమయ్యాడు. అక్కడికి వచ్చిన ఎస్ఐ లంచం తీసుకుంటుండగా అప్పటికే అక్కడ మాటివేసిన ఏసీబీ పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొదట ఆ సొమ్ము తనది కాదంటూ ఎస్సై దబాయించాడు కానీ ఆ తర్వాత అంగీకరించక తప్పలేదు. ఎస్ఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు మాంటిస్సోరి స్కూలుకి తీసుకెళ్లి విచారణ చేపడుతున్నారు.