సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసిన 49 మందిపై సిఐడి కేసులు నమోదు చేసింది. న్యాయమూర్తులపైనా, తీర్పుల పైనా అభ్యంతరకరమైన, జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ 49 మందిలో ప్రముఖంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు.
వీరితో బాటు మరో 47 మందిపై నేడు సిఐడి కేసులు నమోదు చేసింది. సోషల్ మీడియాలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన వారి జాబితాను సత్యం న్యూస్ నిన్న ప్రచురించిన విషయం తెలిసిందే. వారిపై నేడు సిఐడి కేసు పెట్టింది.
వీరిలో కొందరు మారుపేర్లతో సోషల్ మీడియా పోస్టుల పెట్టినందున వారిని పోలీసులు గుర్తించాల్సి ఉంది. హై కోర్ట్ రిజిస్టర్ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వీరిపై IT ACT 57, 153(A) 505(2) 506 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అడ్వకేట్ జనరల్ కూడా ఈ వ్యాఖ్యలపై కోర్టు ధిక్కరణ కేసు పెట్టాల్సిందేనని అభిప్రాయపడటంతో కోర్టు తదుపరి చర్యలకు ఉపక్రమించింది. కోర్టు జారీ చేసిన లీగల్ నోటీసులను 49 మందికి అందచేస్తారు. వారంతా స్వయంగా కానీ, న్యాయవాదిద్వారా గానీ కోర్టుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు కోర్టు జూన్ 16 వరకూ గడువు ఇచ్చింది.