ఏపీఈఏపీ సెట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభినందనలు తెలిపారు. ప్రతీ విద్యార్ధి గ్లోబల్ స్ధాయికి ఎదగాలన్నది సీఎం వైఎస్ జగన్ ప్రయత్నమని చెప్పారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం విద్యార్దుల మంచి భవిష్యత్ కోసమేనని అన్నారు.
దేశంలోనే టాప్ రాష్ట్రంగా ఏపీని ఉంచుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. విద్య కోసం వెచ్చించే ప్రతీ రూపాయి రాష్ట్ర అభివృద్ధికే ఉపయోగపడుతుందని చెప్పారు. విద్య పట్ల ప్రతీ ఒక్కరికి శ్రద్ధ పెరిగిందని అన్నారు. గత నెల 15 నుంచి 23 వరకు జరిగిన ప్రవేశ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 3,15,297 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఇందులో ఎంపీసీ స్ట్రీమ్లో 2,38,180 మందికి గాను 2,24,724 మంది, బైపీసీ స్ట్రీమ్లో 1,00,559 మందికి గాను 90,573 మంది పరీక్ష రాశారు. కోవిడ్ సమయంలో తొలగించిన ఇంటర్మీడియెట్ వెయిటేజ్ మార్కులను ఈసారి పరిగణలోకి తీసుకుని ఫలితాలను ప్రకటించారు.