కరోనా బాధితుకలు ఉచిత వైద్యం అందివ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ లో తలపెట్టిన సత్యాగ్రహదీక్షను టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనూ, రాష్ట్రంలో కరోనో, బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యాయని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వైద్యం కోసం పేదలు ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందని, అందుకే పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా, బ్లాక్ ఫంగస్ లను ఆరోగ్య శ్రీ లో చేర్చి ఎలాంటి ఖర్చు లేకుండా చికిత్స అందివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కరోనా బారిన పడిన 10 లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. కరోనా మృతుల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ర్టంలో భయంకర పరిస్థితులు ఉన్నాయని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు.
దేశంలో ఎక్కడా వ్యాక్సిన్ కూడా లేదని ఆయన అన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కూడా కేంద్రంలో మోడీ లాగే ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇన్ని మరణాలకు కారణం సీఎం కేసీఆరే కారణమని ఆయన తెలిపారు.
శాసన మండలి, శాసనసభ లో కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చండి అని చెప్తే ఒప్పుకున్నారని అయితే 9 నెలలు అవుతున్న ఇప్పటికి అమలు కాలేదని భట్టి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, యూత్ అధ్యక్షులు శివ సేనా రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు వెంకట్, నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, కోదండ రెడ్డి, మల్లు రవి, బొల్లు కిషన్, నగేష్ ముదిరాజ్, ఆడమ్ సంతోష్, ఫిరోజ్ ఖాన్, వినోద్ రెడ్డి, నిరంజన్, సోహైల్, సునీత రావ్, నూతి శ్రీకాంత్ మెట్టు సాయి తదితరులు కూడా పాల్గొన్నారు.