అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ లు వ్యవసాయ చట్టాలను సమర్థించారని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు.
రాజ్యసభలో వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడుతూ తనకన్నా ముందు ప్రధానిగా పని చేసిన డాక్టర్ మన్ మోహన్ సింగ్ వ్యవసాయ దారులు తమ ఉత్పత్తులను అమ్ముకునే సమయంలో కలుగుతున్న ఆటంకాలను తొలగించాల్సిన అవసరం ఉన్నట్లు పలు మార్లు ప్రస్తావించారని ఆయన తెలిపారు.
ప్రధాని మోడీ ప్రసంగ సమయంలో రాజ్యసభలో మాజీ ప్రధాని డాక్టర్ మన్ మోహన్ సింగ్ ఉన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద తమ ప్రభుత్వం రూ.1.15 లక్షల కోట్ల రూపాయలు చెల్లించిందని ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు.
అదే విధంగా పంటల బీమా కింద రైతులు క్లయిం చేసిన రూ 90,000 కోట్లను కూడా తమ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. చాలా చోట్ల అమలు చేస్తున్నట్లు పంట రుణాల మాఫీ పథకం చిన్న రైతులకు ఎలాంటి మేలు కలిగించడం లేదని, ఎందుకంటే చాలా మంది చిన్న సన్నకారు రైతులకు అసలు బ్యాంకు ఎకౌంట్లే ఉండటం లేదని ఆయన అన్నారు.
ఒక హెక్టారు కన్నా తక్కువ భూ కమతం ఉన్న రైతుల సంఖ్య 51 శాతం నుంచి 68 శాతానికి పెరిగిందని మోడీ తెలిపారు. చిన్న రైతుల సంఖ్య 12 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు. వ్యవసాయ రంగంలో రెండు అంకెల వృద్ధి రేటు సాధించాల్సిన తరుణంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు తప్పని సరి అని ఆయన అన్నారు.
ప్రతిపక్షాలు వ్యవసాయ చట్టాల విషయంలో చేస్తున్న వాదనలో పసలేదని ఆయన తెలిపారు. చిన్న మధ్య తరగతి రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ప్రతిపక్షాలు అడ్డుకోవడం సబబు కాదని ఆయన అన్నారు.