ప్రత్యేక స్థితిగతులు, అటవీ ప్రాంతం వెనుకబడిన నాగర్ కర్నూల్ జిల్లాలో మహిళల సాధికారత, విద్య, వైద్యానికి కార్పోరేట్ సంస్థలు తమవంతు సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. సోమవారం బిజినేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో యునైటెడ్ వే సహకారం తో నిర్మించిన 30 పడకల పోర్టబుల్ ఆసుపత్రి ( మేడిక్యాబ్ మోడ్యుల్ ) ని యునైటెడ్ వె నుండి తాళంచెవులు తీసుకొని జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అప్పగించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ గత 7 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ద్వారా తీసుకు వచ్చిన కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్ ( సి.ఎస్.ఆర్ ) అనుసరించి కార్పోరేట్ సంస్థలు తాము అభివృద్ధి సాధిస్తూ తమ పరిసర ప్రాంతాలు, వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తమవంతు సహకారం అందించాల్సి ఉంటుందని ఇందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని బిజినెపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకల పోర్టబుల్ ఆసుపత్రి, లింగాలలో 10 పడకలు, వంగూర్ లో 20 పడకల ఆసుపత్రులను యునైటెడ్ వే కార్పోరేషన్ వేల్స్ ఫార్గో ఆర్థిక సహకారంతో నిర్మించి ఇవ్వడం జరిగిందన్నారు.
అందుకు వారికి జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారత, ఉపాధి, విద్య తక్కువగా ఉండి చెంచు పెంటలు కలిగి ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాలో కార్పోరేట్ సంస్థలు తమ వంతు సహకారం చేసి జిల్లా యంత్రంగంతో కలిసి నడవాల్సిన అవసరం చాలా ఉందని వక్కాణించారు. జిల్లాలో మరిన్ని ప్రాంతాల్లో తమ సేవలు విస్తరించాలని, మహిళల ఉపాధికి కావాల్సిన సహకారం అందిందాలని కార్పోరేట్ సంస్థలను కోరారు.
కరోనా వంటి విపత్కర సమయంలో తమ జీవితాలను ఫణంగా పెట్టి వైద్య సిబ్బంది ముఖ్యంగా మహళా సిబ్బంది ఆశా వర్కర్లు, ఎ.ఎన్.యం. లు ఇతర వైద్య సిబ్బంది కరోనా రోగులకు వైద్య సేవలు అందించడం జరిగిందని కొనియాడారు. జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం పై వైద్య సిబ్బందిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేల్స్ ఫార్గో అధికారిణి బంధన ఝా మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు చాల బాగున్నాయని, చెరువులు, పంటపొలాలు తననెంతో ఆకర్షించాయని, ఇక్కడి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. యునైట్ వే సహకారంతో మేడి క్యాబ్ వారు ఈ 30 పడకల పోర్టబుల్ ఆసుపత్రిని ఏర్పటు చేయడం జరిగిందని ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో విద్యా, వైద్యానికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకై తమవంతు సహకారం అందిస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే సి.ఇ.ఓ రేఖా శ్రీనివాసన్ మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్య సిబ్బంది ఎంతో సేవలు చేసిందని, ప్రైవేట్ ఆసుపత్రిలో కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రతి ఒక్క కోవిడ్ రోగిని చేర్పించుకొని సేవలు అందించడం మాకు ఏంటో సంతోషం కలిగించిందని, దీనికి బదులుగా తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో దేశ వ్యాప్తంగా ఆసుపత్రులు, ఐ.సి.యు పడకలు, ఐసోలేషన్ పడకలు వంటివి సమకూర్చడం జరుగుతుందని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి సుధాకర్ లాల్, డిప్యూటి డి.యం.హెచ్.ఓ వెంకట దాస్, డా. సాయినాథ్ రెడ్డి, యునైటెడ్ వే అధికారులు భుష్ణ్ కందూరి రాములు, శ్రీనివాస్, వసీం, అఖిలేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్