రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాలపై పదహారేళ్ల బాలిక మందరి గాయత్రి అనుమానాస్పద రీతిలో శవం లభించింది. రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ముక్కలైన గాయత్రి శవాన్ని స్థానికులు కనుగొన్నారు. ప్రస్తుతం సంఘటనా స్థలానికి రైల్వే పోలీసులు వచ్చారు. మృతురాలి వద్ద బ్యాగులో లభించిన ఆధారాల ప్రకారం మందరి గాయత్రిగా గుర్తించారు. ఆమె వద్ద ఉన్న సెట్ హాల్ టికెట్ ఆధారంగా ఆమె వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె పేరు గాయత్రి తండ్రి పేరు చిన్న కిష్టయ్య, తల్లి పేరు సరస్వతిగా గుర్తించారు. గాయత్రి శంషాబాద్ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిది,పదో తరగతి చదువుతున్నటు బోనఫైడ్ ద్వారా తెలుస్తోంది. తన జనరల్ కాలేజ్ హాల్ టికెట్ కూడా పోలీసులకు లభ్యమైంది. అసలు గాయత్రి ఆత్మహత్యఎందుకు చేసుకుంది? ఏదైనా అఘాయిత్యం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పదహారేళ్ల బాలిక గాయత్రి దళిత కులానికి చెందినదిగా నిర్ధారణ అవుతుంది. గాయత్రికి అసలు ఏం జరిగిందో పోలీసులు తమ విచారణలో తేల్చాల్సి ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం గాయత్రి రైలు పట్టాలపై తిరుగుతూ కనిపించింది. రైల్వే సిబ్బంది ఒకరు ఆమెను రైలు పట్టాలను దిగి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాను.. అంటూ బాలిక రైల్వే సిబ్బందికి సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అంతలోనే రైలు సమీపించగా బాలిక రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్ధారణ అవుతుంది. అసలు గాయత్రికి వచ్చిన కష్టం ఏమిటో పోలీసులు తేలాల్సి ఉంది.
previous post
next post