హైదరాబాద్ నగరంలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారాస్త్రమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీ మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
ఏడాదికి కోటి చొప్పున ఉద్యోగాలిస్తామని చెప్పింది. ఆరున్నరేళ్లలే ఆరు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తోందన్నారు. ఈ కారణంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, ఓఎన్జీ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.
ప్రతిష్టాత్మకమైన బీహెచ్ఈఎల్ మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ తెరాస ప్రభుత్వం మాత్రం బీహెచ్ఈల్ కు 30వేలకోట్ల యాదాద్రి పవర్ ప్రాజెక్టు పనులు అప్పగించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఆసియాలోనే అతి పెద్ద 148 మెగావాట్ల పంపు పనులు అప్పగించింది. కేంద్రం కాని, దేశంలో ఏ రాష్ట్రం కూడా బీహెచ్ఈఎల్ కు పనులు అప్పగించలేదన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పడు ఎనిమిది శాతం కన్నా ఎక్కువ జీడీపీ వృద్ధి రేటు ఉంటే, బీజేపీ దాన్ని మైనస్ ఇరవై నాలుగు శాతానికి తీసుకెళ్లిందన్నారు. దీని వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ఈ విషయాలన్నీ తెరాస కార్యకర్తలు గడప గడపకు తీసుకెళ్లి వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్నారు.
కాంగ్రెస్ నుంచి పలువురు స్థానిక నేతలు తెరాసలో చేరారు. వారిని మంత్రి హరీశ్ రావు గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.