తెలంగాణలో మావోయిస్టుల ఏరివేతపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నది. మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గత కొన్ని రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తిర్యాణి-మంగి, కవ్వాల్ అభయారణ్యంను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఏజెన్సీ మండలాలతో పాటు ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్ జరుపుతున్నారు.
పోలీసులు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్ను డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టుల అలజడి నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి గత నాలుగు రోజులుగా ఆసిఫాబాద్లోనే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి మావోయిస్టు ప్రాబల్యమున్న తిర్యాణి పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనఖీ చేశారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు.
గురువారం ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మరణించిన సంగతి తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోలు సంచరిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ నిఘా పెంచారు. ఈ క్రమంలో గుండాల మండలం దేవళ్లగూడెం అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించారు. గత రెండు నెలలుగా కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం అడవుల్లో నెలకొన్న పరిణామాల పై డీ జీ పి ఆరా తీశారు. తిర్యాని మండలం లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల గురించి తిర్యాని ఎస్సై రామారావు ను అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించినట్లు సమాచారం. గత నెల టోక్కి గూడెం లో జరిగిన ఎదురుకాల్పులు పై కూడా ఆయన ఆరాతీస్తున్నారు. కరోనా సమయంలో గిరి పుత్రులకు అందించిన సేవలపై తిర్యాని ఎస్సై రామారావును డీజీపి అభినందించారు.